ETV Bharat / bharat

'30 ఏళ్ల తర్వాత అన్ని స్థానాల్లో పోటీ.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం'

author img

By

Published : Jan 31, 2022, 8:46 PM IST

UP assembly elections 2022, priyanka gandhi
ప్రియాంక గాంధీ, యూపీ అసెంబ్లీ ఎన్నికలు

Priyanka gandhi vadra: దాదాపు మూడు దశాబ్దాల ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం 403 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ఇది తమకు అతి పెద్ద ఘనత అన్నారు. యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా తనపై ఎన్ని కేసులు నమోదైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అంతేకాకుండా కోర్టు కేసులు లేదా జైలు శిక్ష అనుభవించేందుకైనా మానసికంగా సిద్ధమయ్యానని తెలిపారు.

UP assembly elections 2022: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమపార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 403 స్థానాల్లో పోటీ చేయడం అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు. ఇక యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా తనపై ఎన్ని కేసులు నమోదైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అంతేకాకుండా కోర్టు కేసులు లేదా జైలు శిక్ష అనుభవించేందుకైనా మానసికంగా సిద్ధమయ్యానని తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌతమ బుద్ధ నగర్‌లో ప్రియాంక గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆమె.. ‘దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ 403 స్థానాల్లో పోటీకి దిగుతోంది. ఇది మాకు అతిపెద్ద విజయం. అన్ని స్థానాల్లో బరిలో దిగి గట్టి పోటీ ఇస్తాం’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఆ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ వంటి నేతలపై కేసులు నమోదు చేయడాన్ని ప్రస్తావించిన ఆమె.. ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచే అటువంటి వాటన్నింటికీ మానసికంగా సిద్ధమయ్యాయని అన్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా, అరెస్టు చేసి జైల్లో పెట్టినా ప్రజల తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు కుల రాజకీయాలు, మతపరమైన అంశాలపై దృష్టి పెట్టడంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని, కేవలం స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలనే పరిగణనలోకి తీసుకొవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉంటే, గత ఎన్నికల్లో (2017లో) సమాజ్‌వాదీ పార్టీతో జతకట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఆ ఎన్నికల్లో 300లకుపైగా స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. ఎస్‌పీ-కాంగ్రెస్‌ పార్టీలు కలిసి కేవలం 60 సీట్లు కూడా సాధించలేకపోయాయి. ఈసారి మాత్రం ఒంటరిగా రంగంలోకి దిగి అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: పంజాబ్​ మళ్లీ 'హస్త'గతం అవుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.