ETV Bharat / bharat

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. వైద్యుల కీలక ప్రకటన

author img

By

Published : Mar 3, 2023, 2:06 PM IST

Updated : Mar 3, 2023, 3:01 PM IST

sonia-gandhi-in-hospital
ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్​ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె.. దిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్​లో చేరారు.

కాంగ్రెస్​ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె.. దిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ చేరారు. "గురువారం సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అరూప్ బసు బృందం ఆమెను పర్యవేక్షిస్తోంది." అని సర్ గంగా రామ్ హాస్పిటల్ ట్రస్ట్ సొసైటీ ఛైర్మన్ డీఎస్ రాణా శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

అంతకుముందు ఈ ఏడాది జనవరి 3న సోనియా గాంధీ అనారోగ్యం పాలయ్యారు. సోనియా గాంధీని ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ జనవరి 4న.. గంగారామ్​ ఆస్పత్రిలో చేర్పించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2022లో రెండుసార్లు కరోనా బారిన పడ్డారు. జూన్‌లో ఒకసారి, ఆగస్టులో మరోసారి ఆమెకు కొవిడ్ సోకింది. ఫలితంగా కొవిడ్ అనంతర సమస్యలు తలెత్తాయి.

ఫిబ్రవరిలో ఛత్తీస్​గఢ్​లో జరిగిన పార్టీ ప్లీనరీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా భారత్ జోడో యాత్రతో 'తన ఇన్నింగ్స్' ముగిసినందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. భారత్​ జోడో యాత్ర కాంగ్రెస్​కు టర్నింగ్ పాయింట్ అని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని జోడో యాత్ర సందర్భంగా రుజువైనట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్​ ప్లీనరీ సమావేశంలో భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సోనియా గాంధీ. మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతుందని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుందని విమర్శించారు. అదానీ వంటి సంస్థలను పెంచి పోషిస్తోందని సోనియా విరుచుకుపడ్డారు. రాజ్యాంగ విలువలను బీజేపీ ఎప్పుడో మర్చిపోయిందని అన్నారు.

రాజకీయాలకు గుడ్​బై?
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో తన ఇన్నింగ్స్ ముగిసిందని సోనియా పేర్కొనడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. సోనియా ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు, వచ్చే ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోరంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఊహాగానాలు తీవ్రం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం సంతోషంగా ఉందని చెప్పారే తప్ప.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించటం సోనియా ఉద్దేశం కాదని ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు కుమారి షెల్జా తెలిపారు. అటు కాంగ్రెస్ సీనియర్​ నేత దిగ్విజయ్ సింగ్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సోనియా అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు భారత్ జోడో యాత్ర ప్రారంభమైందనే విషయాన్ని సూచిస్తూ అలా వ్యాఖ్యానించారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ వివరణతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారానికి తెరపడింది.

Last Updated :Mar 3, 2023, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.