ETV Bharat / bharat

'కొవిడ్ పేరుతో యాత్రను ఆపేందుకు ప్లాన్'.. కేంద్రంపై రాహుల్​ ఫైర్​!

author img

By

Published : Dec 22, 2022, 5:14 PM IST

rahul gandhi bharat jodo yatra
rahul gandhi

కొవిడ్​ దృష్ట్యా భారత్​ జోడో యాత్రను నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి రాసిన లేఖపై రాహుల్​ గాంధీ స్పందించారు. ఇదంతా యాత్రను ఆపేందుకు భాజపా వేస్తున్న ప్లాన్​ అని ఆయన ఆరోపించారు. మరోవైపు ఈ విషయమై కొంతమంది కాంగ్రెస్​ నేతలు సైతం స్పందించారు.

'భారత్ జోడో యాత్ర'ను నిలిపివేసేందుకు ప్రభుత్వం "సాకులు" వెతుకుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పేరు చెప్పి యాత్రను నిలిపివేయాలని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. జోడో యాత్ర హరియాణాలోని నూహ్​కు చేరుకోగా.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "ఈ యాత్ర త్వరలో కశ్మీర్‌కు చేరుకుంటుంది. ఇది ఓర్వలేని ప్రభుత్వం కొవిడ్ వ్యాప్తి చెందుతున్నందున వెంటనే యాత్రను ఆపండి అని చెబుతోంది. ఈ యాత్ర వల్ల తమకు నష్టం కలుగుతుందని భయపడుతున్న భాజపా.. మాస్క్‌లు ధరించాలని, కొవిడ్ వ్యాప్తి పెరుగుతోందని సాకులు చెబుతోంది" అంటూ ధ్వజమెత్తారు రాహుల్. "దేశానికి ఉన్న శక్తిని, సత్యాన్ని చూసి వారందరూ భయపడుతున్నారు. ఇది వాస్తవం" అని రాహుల్​ అన్నారు.

Rahul Gandhi Bharat Jodo Yatra in Nuh
భారత్​ జోడో యాత్రలో రాహుల్​ గాంధీ

రాహుల్​తో పాటు పలువురు కాంగ్రెస్​ నేతలు సైతం కేంద్రం వైఖరిపై మండిపడ్డారు. "నిన్న రాహుల్​ గాంధీ లేఖ అందుకున్నారు. నేడు ప్రధాన మంత్రి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. రేపు భారత్​ జోడో యాత్ర దిల్లీకి చేరుకోనుంది. ఇదంతా ఎలా సాగుతోందో ఇప్పుడు మీరే ఆలోచించండి" అని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ మండిపడ్డారు. కొవిడ్​ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం భారత్​ జోడో యాత్రను టార్గెట్​ చేసిందన్న జైరాం​.. కర్ణాటక, రాజస్థాన్​లో భాజపా చేస్తున్న యాత్రల మాటేంటని ప్రశ్నించారు.

Rahul Gandhi Bharat Jodo Yatra in Nuh
భారత్​ జోడో యాత్రలో రాహుల్​ గాంధీ

'మావి రాజకీయాలు కాదు'
అయితే, కరోనాపై తాము ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని మాండవీయ స్పష్టం చేశారు. "భారత్ జోడో యాత్రలో పాల్గొన్నవారిలో కొందరికి కరోనా పాజిటివ్​గా తేలిందని నాకు తెలిసింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని నాకు రాజస్థాన్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. దీనిపై రాజకీయం చేయాలని నేను అనుకోవడం లేదు" అని పార్లమెంట్​లో స్పష్టం చేశారు.

"కరోనా తొలి, రెండో వేవ్​ల సమయంలోనూ మేం వైరస్​పై రాజకీయాలు చేయలేదు. కానీ, వైద్య శాఖ మంత్రిగా దేశంలో కొవిడ్ వ్యాపించకుండా చూసుకోవడం నా బాధ్యత. అందుకే యాత్ర కన్వీనర్​కు, ముఖ్యమంత్రికి లేఖ రాశా. కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించా. కానీ కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రం మాట వినడం లేదు" అని మాండవీయ పేర్కొన్నారు.

జన్ ఆక్రోశ్​ యాత్రకు బ్రేక్​..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాజస్థాన్‌లో జరుగుతున్న 'జన్ ఆక్రోశ్​ యాత్ర'ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు భాజపా పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం తెలిపారు. రాజకీయాల కంటే తమకు ప్రజలే ముఖ్యమని.. వారి భద్రత, ఆరోగ్యమే భాజపాకు ప్రధానమని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ జరుపుతున్న భారత్ జోడో యాత్ర మాత్రం మార్నింగ్​, ఈవెనింగ్​ వాక్​లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో కాంగ్రెస్​ ఆడుకుంటోందని మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.