ETV Bharat / bharat

Supreme Court: అనాథ బాలలకు త్వరగా 'పీఎం కేర్స్‌'

author img

By

Published : Aug 27, 2021, 7:25 AM IST

Supreme court
సుప్రీం కోర్టు

కొవిడ్(Covid-19)​ కాలంలో అనాథలైన బాలలను వెంటనే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది సుప్రీం కోర్టు(Supreme court). 'పీఎం కేర్స్​ చిల్డ్రన్'​ (PM-CARES Fund)వీరికి సహాయం చేయాలని పేర్కొంది. ఈ విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సర ఫీజు రద్దు చేసేలా ప్రైవేటు పాఠశాలలతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

కరోనా(Corona virus) కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలైన బాలలకు 'పీఎం కేర్స్‌ చిల్డ్రన్‌'(PM-CARES) పథకం కింద సహాయం అందించే చర్యలను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు(Suprme court) గురువారం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వీరి చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. బాలలకు సహాయం అందించేందుకు ప్రత్యేక పోర్టల్‌ రూపొందించామని, ఇంతవరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 2,600 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తొలుత కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో 418 దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు ఆమోదించారని పేర్కొంది.

దాంతో మిగిలిన వారి దరఖాస్తులను కూడా పరిశీలించి, ఆమోదించాలని కలెక్టర్లను ధర్మాసనం ఆదేశించింది. 'చిన్నారులపై కరోనా మహమ్మారి ప్రభావం'పై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతుండడం గమనార్హం. ఈ సందర్భంగా మరికొన్ని సూచనలు చేసింది.

  • అవసరమైతే పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న ఈ 2600 మంది బాలల పాఠశాల ఫీజులు, ఇతర ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరించాలి.
  • ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ విద్యార్థుల ఫీజులను రద్దు చేసేలా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి. ఒకవేళ ఆ పాఠశాలలు అందుకు అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలే ఆ ఫీజులను చెల్లించాలి.
  • ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న ఆ విద్యార్థుల ఫీజులు, ఇతర ఖర్చులను ప్రస్తుత విద్యాసంవత్సరానికి భరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు కోరవచ్చు.
  • ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజులను తక్షణమే చెల్లించాల్సి ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
  • చిన్నారుల వివరాలను బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయడం ఆలస్యం కాకుండా చూడాలి.

బాలలకు లబ్ధి ఇలా..

  • ధర్మాసనం అడిగిన మేరకు కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భటి 'పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌' పథకం కింద అందించే సహాయాన్ని వివరించారు.
  • లబ్ధి పొందే బాలలను మూడు వర్గాలుగా విభజించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన వారు; గతంలో ఒకర్ని, ఇప్పుడు రెండోవారిని కోల్పోయిన వారు; చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయినవారు అన్న విభజన చేశారు.
  • వీరిని గుర్తించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఈ విషయంలో పోలీసులు, జిల్లా శిశు సంరక్షణ కేంద్రాలు సహకారం అందించాల్సి ఉంటుంది.
  • అయిదు రూపాల్లో సహాయం అందుతుంది. పదో ఏట వరకు సమీపంలోని కేంద్రీయ విద్యాలయం, లేదంటే ప్రయివేటు పాఠశాలలో డే స్కాలర్‌గా ప్రవేశం పొందే అవకాశం ఉంది. ప్రయివేటు పాఠశాలలో చేరితే విద్యా హక్కు చట్టం ప్రకారం పీఎం కేర్స్‌ నుంచి ఫీజులు చెల్లిస్తారు.
  • 11-18 ఏళ్ల వరకు నెలవారీ ఉపకార వేతనం చెల్లిస్తారు. రూ.10 లక్షల మొత్తాన్ని వారి పేరున ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తారు.
  • 23 ఏళ్లు వచ్చే సరికి ఆ మొత్తాన్ని వారికి చెల్లిస్తారు.
  • ఏకరూప దుస్తులు, పుస్తకాలకయ్యే ఖర్చులు ఇస్తారు.
  • ఉన్నత విద్య, ఆరోగ్య బీమాకు అవకాశం కల్పిస్తారు.

రాష్ట్రాలకు సూచనలు

ఈ సందర్భంగా కోర్టు సహాయకుడు (అమికస్‌ క్యూరీ) గౌరవ్‌ అగర్వాల్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.

వివరాలను అప్‌లోడ్‌ చేయండి

ఆంధ్రప్రదేశ్‌కు ఆదేశం..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా మార్చి 2020 నుంచి 326 మంది చిన్నారులు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయారు. 711 మంది తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారు. మిగతా చిన్నారులకు సంబంధించిన వివరాలపై విచారణ పూర్తి చేయాల్సి ఉంది. కొవిడ్‌తో కాకుండా ఇతర కారణాలతో చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోతే నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది మెహఫూజ్‌ నజ్కీ విన్నవించారు. తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన వారిలో 190 మందికి రూ.పది లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందజేసిందని తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్‌ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకొని '326 మంది అనాధలు, ఇతర వ్యాధులు, కారణాలతో తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన 7010 మంది చిన్నారులకు సంబంధించిన వివరాలను జిల్లా మేజిస్ట్రేట్లు వెంటనే అప్‌లోడ్‌ చేయాలి. చిన్నారులకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి' అని ఆదేశించారు.

వారిని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చండి: తెలంగాణకు ఆదేశం..

రాష్ట్రంలో కరోనాతో తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన 221 మంది చిన్నారులకు సమగ్ర బాలల రక్షణ పథకం (ఐసీపీ) కింద తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని కోర్టు సహాయకుడు గౌరవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కొవిడ్‌తో 914 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరు కోల్పోయారని, వారిని ఆదుకోవాల్సి ఉన్నందున వారి వివరాలతో కూడిన తుది నివేదికను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 'విచారణలు త్వరగా పూర్తి చేసి, మూడు వారాల్లో బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌లో ఆ సమాచారం అప్‌లోడ్‌ చేయాలి. 221 మంది అనాధల్లో 96 మందిని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు. వారి విద్యాభ్యాసం బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. 914 మంది చిన్నారులనూ ప్రైవేటు పాఠశాలల్లో చేర్చాలి' అని ఆదేశించింది.

లక్ష మంది పిల్లలకు రక్షణ అవసరం

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ నివేదిక సమర్పిస్తూ దేశవ్యాప్తంగా మొత్తం 1,01,032 మంది పిల్లలకు రక్షణ అవసరమని తెలిపింది. వీరిలో 10,980 మంది మూడేళ్లలోపు చిన్నారులని పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.