ETV Bharat / bharat

అప్పటి వరకు జేపీ నడ్డానే భాజపా జాతీయ అధ్యక్షుడు

author img

By

Published : Jan 17, 2023, 4:17 PM IST

Updated : Jan 17, 2023, 7:46 PM IST

BJP decided to extend party president J P Nadda
భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు

భాజపా అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం పొడిగించింది. జూన్ 2024 వరకు అధ్యక్షుడిగా జేపీ నడ్డానే కొనసాగుతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, జేపీ నడ్డాపై అమిత్​ షా ప్రశంసలు కురిపించారు.

భాజపా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవి కాలాన్ని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం పొడిగించింది. దిల్లీ వేదికగా జరిగిన భాజపా జాతీయ సంస్థాగత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. భాజపా జాతీయ అధ్యక్షుడిగా జెపీ నడ్డా పదవీకాలాన్ని జూన్ 2024 వరకు పొడిగించాలని పార్టీ కార్యవర్గం నిర్ణయించిందని అమిత్ షా తెలిపారు. జేపీ నడ్డా పదవి కాలం పొడగింపు నిర్ణయాన్ని.. పార్టీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆయన వెల్లడించారు.

వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నడ్డా పదవీకాలం పొడగింపునకు ప్రాధాన్యమిచ్చినట్లు అమిత్​షా తెలిపారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో భాజపా మంచి విజయం సాధించిందన్నారు అమిత్​షా. నరేంద్ర మోదీ, జేపీ నడ్డా నాయకత్వంలో 2024లోనూ అంతకంటే భారీ విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జేపీ నడ్డా సారథ్యంలో భాజపా దూసుకెళ్తోందని, 2024 ఎన్నికల్లోనూ మోదీనే ప్రధానిగా ఎన్నికవుతారని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. పార్టీకి నడ్డా చేసిన సేవలను అమిత్​షా కొనియాడారు. కొవిడ్ సమయంలో పార్టీని సమన్వయం చేస్తూ, ప్రజలకు సేవ చేశారని నడ్డాను ఆయన అభినందించారు. నడ్డా నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని షా వెల్లడించారు.

bjp-national-executive-unanimously-decided-to-extend-party-president-j-p-nadda
భాజపా జాతీయ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ, నడ్డా

2019 జూన్​లో నడ్డా భాజపా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2020 జనవరిలో నడ్డా భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్ షా నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. 2019 పార్లమెంట్​ ఎన్నికలకు ముందు అమిషాకు కూడా ఇదే తరహాలో పదవీకాలం పొడిగించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

bjp-national-executive-unanimously-decided-to-extend-party-president-j-p-nadda
భాజపా జాతీయ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ, నడ్డా

ఉందిలే మంచి కాలం..
దేశంలో అత్యుత్తమ శకం రాబోతుందన్నారు మోదీ. మంగళవారం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలతో సంబంధం లేకుండా మైనారిటీలు సహా సమాజంలో ప్రతి వర్గాన్ని చేరుకోవాలని భాజపా సభ్యులకు పిలుపునిచ్చారు. "భాజపా రాజకీయ పార్టీ మాత్రమే కాదు. సామాజిక ఆర్థిక పరిస్థితులను మార్చే ఉద్యమం. 18-25 ఏళ్ల మధ్య వయస్సు గల వారు భారతదేశ రాజకీయ చరిత్రను చూడలేదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి వారికి తెలియదు. దీనిపై వారికి అవగాహన కల్పించాలి. భాజపా సుపరిపాలన గురించి వారందరికీ తెలియజేయాలి." అని భాజపా నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని.

సామాజిక-ఆర్థిక తీర్మానానికి ఆమోదం:
మంగళవారం, భాజపా సంస్థాగత సమావేశంలో ప్రవేశ పెట్టిన సామాజిక-ఆర్థిక తీర్మానానికి కార్యవర్గం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో రాజకీయాలు, పాలన సంతృప్తికర స్థాయిలో సాగుతున్నాయన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల అవసరాలను పూర్తిగా తీరుస్తోందన్న ఆయన.. ఇవే అంశాలు తీర్మానంలో పొందుపరిచినట్లు తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టినందుకు భాజపా కార్యవర్గం.. మోదీ కృతజ్ఞతలు తెలిపిందని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

bjp-national-executive-unanimously-decided-to-extend-party-president-j-p-nadda
భాజపా జాతీయ జాతీయ కార్యవర్గ సమావేశం

"గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో, భాజపా ప్రభుత్వం.. భారత ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా రూపొందించింది. భారత్​ను స్వీయ ఆధారిత దేశంగా తయారుచేసింది. 'సబ్​కా సాత్ సబ్‌కా వికాస్' అనేది మా నినాదం మాత్రమే కాదు, తమ పార్టీ సిద్ధాంతం" అని ధర్మేంద్ర ప్రధాన్​ అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చినప్పుడు దేశం బలహీనంగా ఉండేదని.. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైందన్నారు ప్రధాన్​. ఈ తీర్మానంలో పేదలకు ఉచిత రేషన్​, కొవిడ్​ సమయంలో ఫ్రీ వాక్సిన్​లను అందించడం వంటివి పొందుపరిచామని ఆయన వెల్లడించారు. మోదీ నాయకత్వంలో భారత్‌ సహకారం ప్రపంచ జీడీపీలో 2.6 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగిందని ప్రధాన్ గుర్తు చేశారు.

bjp-national-executive-unanimously-decided-to-extend-party-president-j-p-nadda
భాజపా జాతీయ జాతీయ కార్యవర్గ సమావేశం

"భాజపా సంస్థాగత సమావేశంలో ప్రవేశపెట్టిన సామాజిక-ఆర్థిక తీర్మానం.. మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఆయన నాయకత్వంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. ప్రపంచ డిజిటల్ లావాదేవీలలో 40 శాతం భారత దేశంలోనే జరుగుతున్నాయి. జీఎస్​టీ వసూళ్లలో 22.6 శాతం పెరుగుదల వంటి అంశాలు తీర్మానంలో ఉన్నాయి." అని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

Last Updated :Jan 17, 2023, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.