ETV Bharat / bharat

'మమత మార్క్​ పాలనకు రాజకీయ హత్యలే నిదర్శనం'

author img

By

Published : Nov 1, 2020, 5:21 PM IST

Babul supriyo
బాబుల్​ సుప్రియో

రాజకీయ హత్యలు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్క్​ రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు కేంద్ర మంత్రి బాబుల్​ సుప్రియో. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోవటంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ప్రాయోజిత రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 2021లో తృణమూల్​ కాంగ్రెస్​ అధికారం కోల్పోతుందని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో జోస్యం చెప్పారు కేంద్ర మంత్రి.

బంగాల్​లో హింసాత్మక ఘటనలను పెరిగిపోతున్నాయంటూ తృణమూల్​ కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు చేశారు కేంద్ర మంత్రి బాబుల్​ సుప్రియో. రాజకీయ హత్యలు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో ప్రత్యేకత అని.., ప్రభుత్వ ప్రాయోజిత హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. భాజపా కూడా హింసకు పాల్పడుతోందన్న ఆరోపణలను ఈటీవీ భారత్​ ముఖాముఖిలో ఖండించారు సుప్రియో.

కేంద్ర మంత్రి బాబుల్​ సుప్రియో ముఖాముఖి

" భాజపా ఎప్పుడూ దూకుడుగా ప్రవర్తించలేదు. బంగాల్​ సహా దేశవ్యాప్తంగా 'సబ్​కా సాత్​, సబ్​కా వికాస్​' అనేదే మా సిద్ధాంతం. గత 10 ఏళ్లలో బంగాల్​ను ప్రభుత్వ ప్రాయోజిత రాజకీయ హింస వైపు నెట్టివేశారు. ప్రతిరోజు ఒకరు హత్యకు గురవుతున్నారు. మమతా బెనర్జీకి దీర్ఘాయుష్షు ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నా. కానీ, ఆమె రాజకీయ జీవితం 2021లో ముగియబోతోంది. కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ భాజపా అధికారం చేపడుతుంది. మంచి పాలనను అందిస్తుంది.

మమతా బెనర్జీ.. బంగాల్​లో బాంబుల పరిశ్రమను ఏర్పాటు చేశారు. అలాగే.. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు రేషన్​ కార్డులు అందించి తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్న వామపక్షాల మాదిరిగానే.. టీఎంసీ చేసింది. ఒకానొక సమయంలో పార్లమెంట్​ సాక్షిగా బంగ్లాదేశీయులు బంగాల్​కు ప్రమాదకరమని పేర్కొన్న మమత.. నేడు వారిని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు మమత బెనర్జీ మార్క్​ రాజకీయానికి నిదర్శనం."

- బాబుల్​ సుప్రియో, కేంద్ర మంత్రి.

ప్రస్తుతం బంగాల్​లో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా తెలియదు. అయితే.. ఇటీవల కోల్​కతాలో నిర్వహించిన వర్చువల్​ దుర్గా పూజ కార్యక్రమంలో ప్రధాని మోదీ తనతో పాటు సుప్రియోను భాగం చేసుకోవటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఆయనపై పడింది. అయితే.. ఆ వాదనలు కొట్టిపారేశారు కేంద్ర మంత్రి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నా, లేకున్నా పార్టీలో నాయకులంతా తమ ఆలోచనలు పంచుకుంటూ ముందుకు సాగుతామన్నారు.

దిల్లీ కాలుష్యంపై తగిన చర్యలు..

దిల్లీలో వాయు కాలుష్యంపైనా మాట్లాడారు సుప్రియో. పంట వ్యర్థాలను కాల్చటం ఒక్కటే వాయు నాణ్యత క్షీణించటానికి కారణం కాదని పేర్కొన్నారు. పంటవ్యర్థాల దహనం అరికట్టటం సహా కీలక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమస్య రాత్రికి రాత్రే రాలేదని, అలాగని ఒక్కరోజులో పోయేది కాదన్నారు. ప్రభుత్వంపై బురదజల్లటంతోనూ సమస్య పరిష్కారం కాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ను కోరారు సుప్రియో. దీపావళికి తక్కువ కాలుష్య ఉద్గారాలను విడుదల చేసే టపాసులు కాల్చాలని దిల్లీ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు.

ఇదీ చూడండి: 'కల్యాణ కర్ణాటక' రాష్ట్రం కోసం ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.