ETV Bharat / bharat

''అగ్నిపథ్​'పై కేంద్రం నిర్ణయం భేష్.. వచ్చే వారం నుంచే నియామకాలు!'

author img

By

Published : Jun 17, 2022, 1:40 PM IST

Updated : Jun 17, 2022, 2:43 PM IST

agnipath
అగ్నిపథ్​

Agnipath recruitment new age limit: ఈ ఏడాది 'అగ్నిపథ్​' నియామకాలకు వయోపరిమితిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​ అధిపతులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా సైన్యంలో చేరే అవకాశం రాని యువతకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. 'అగ్నిపథ్'​ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యకమవుతున్న నేపథ్యంలో వీరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. వయోపరిమితి పెంపును కేంద్ర మంత్రులు స్వాగతించగా.. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ప్రధానిపై విమర్శలు గుప్పించారు.

Agnipath recruitment new age limit: 'అగ్నిపథ్'​ పేరిట 17.5 నుంచి 21 ఏళ్ల వారు సైన్యంలో చేరి నాలుగేళ్ల పాటు సేవలు అందించే అవకాశం కల్పిస్తూ ఇటీవల కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే ఈ ఏడాది నియామకాలకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అగ్నిపథ్​పై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం కాగా పలువురు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..

అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ ఏడాది చేరే అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్మీ చీఫ్​ మనోజ్​ పాండే. కరోనా కారణంగా గత రెండేళ్లలో సైన్యంలో చేరే అవకాశం రానివారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించినట్లు అయిందన్నారు.

"డిసెంబరు 2022లో మొదటి బ్యాచ్​ అగ్నివీరులకు శిక్షణ​ ప్రారంభిస్తాం. 2023 జూన్​ లేదా జులైలో వీరికి బాధ్యతలు అప్పగిస్తాం. ఈ నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్​ విడుదల చేస్తాం. త్వరలోనే రిజిస్ట్రేషన్​ మొదలైన అంశాలపై షెడ్యూల్​ ప్రకటిస్తాం."

-మనోజ్​ పాండే, ఆర్మీచీఫ్​

"ఈ ఏడాది జరిగే అగ్నిపథ్​ నియాకాల్లో అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది యువతకు మేలు చేస్తుంది. వాయుసేనలో అగ్నిపథ్​ నియమకాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి."

-వీఆర్​ చౌదరి, ఎయిర్​ఫోర్స్​ చీఫ్​

"అగ్నిపథ్‌ పథకం దేశ రక్షణ వ్యవస్థలో భాగం కావడానికి, దేశ సేవ చేయడానికి యువతకు ఒక సువర్ణావకాశం. గత రెండేళ్లలో నియామకాలు చేపట్టని కారణంగా సైన్యంలో చేరాలనుకున్నవారికి అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్నివీరుల నియామకానికి ఈ ఏడాది వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. ఈ మినహాయింపు ఒకసారికి మాత్రమే. దీనివల్ల అనేక మంది అగ్నివీరులుగా మారేందుకు అర్హత లభిస్తుంది. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రికి యువకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే యువకులంతా అందుకు సన్నద్ధం కావాలని కోరుతున్నాను'.

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ శాఖ మంత్రి

"యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వయోపరిమితిని పెంచాము. ఈ నిర్ణయం దేశ సేవ చేసి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్న యువకులకు లాభం చేకూరుస్తుంది. గత రెండేళ్లు సైన్యంలోని నియామకాలపై కరోనా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో యువతను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు."

-అమిత్​ షా, హోంమంత్రి

క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే అగ్నిపథ్​ అమలుపై తుది నిర్ణయం తీసుకున్నామన్నారు రక్షణ శాఖ సహాయక మంత్రి అజయ్​ భట్. 'అగ్నిపథ్'పై జరుగుతున్న దుష్ప్రచారాలను యువత నమ్మద్దని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉత్తీర్ణులు కాని వారికి కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

అగ్నిపథ్​పై రక్షణశాఖ సహాయక మంత్రి అజయ్​ భట్​

"బాగా చర్చించే అగ్నిపథ్​ పథకాన్ని ప్రవేశపెట్టాము. ఇందులో చేరిన వారికి నాలుగేళ్ల పాటు శిక్షణ​ ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారిలో 25 శాతం మందిని సైన్యంలో చేర్చుకుంటాం. మిగతా 75 శాతం మందికి కూడా చాలా విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఉత్తీర్ణులు కాని అగ్నివీరులకు తాము ఉపాధి కల్పించనున్నట్లు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కాబట్టీ.. నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తు ఏంటని ఎవరూ చింతించాల్సి అవసరం లేదు. బయట జరుగుతున్న దుష్ప్రచారాలను యువత నమ్మద్దు."

-ఈటీవీ భారత్ ముఖాముఖిలో రక్షణ శాఖ సహాయక మంత్రి అజయ్​ భట్​

మోదీకి అవేం వినిపించవు: ప్రధాని నరేంద్రమోదీకి ప్రజల విజ్ఞప్తులు వినిపించవని.. కేవలం ఆయన స్నేహితుల మాటలే వినిపిస్తాయన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. అగ్నిపథ్​ పథకం తొలి ఏడాదికి వయోపరిమితిని 23 ఏళ్లు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుుకన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "అగ్నిపథ్​ను యువత, సాగు చట్టాలను రైతులు, నోట్ల రద్దును ఆర్థిక వేత్తలు, జీఎస్​టీని వ్యాపారులు వ్యతిరేకించారు." అని రాహుల్​ పేర్కొన్నారు. అగ్నిపథ్​ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు ప్రియాంక గాంధీ. కేంద్రం హడావుడిగా ఈ పథకాన్ని అమలులోకి తెచ్చిందని.. ఇది ఉపసంహరించుకుని ఇంతకుముందులానే నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

ఇదీ చూడండి : ఆరు రోజుల్లో 1400 వెబ్​సైట్లు హ్యాకింగ్​.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

Last Updated :Jun 17, 2022, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.