ETV Bharat / bharat

మరాఠాలకు ఈడబ్ల్యూఎస్​ కోటా వర్తింపు

author img

By

Published : May 31, 2021, 8:11 PM IST

Updated : May 31, 2021, 9:00 PM IST

EWS quota to Marathas
మరాఠాలకు ఈడబ్ల్యూఎస్​ కోటా

మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను సుప్రీం కోర్టు రద్దు చేసిన క్రమంలో వారికి ఆర్థికంగా వెనకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్​) కోటాను వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర. మరోవైపు.. సుప్రీం తీర్పుపై సమీక్షించటం, భవిష్యత్తు కార్యాచరణపై ఏర్పాటైన దిలీప్ బోస్లే కమిటీ గడువును పొడిగించింది.

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్​ కల్పించటంపై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని మరాఠాలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్​) కోటా వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంపై జనరల్​ అడ్మినిస్ట్రేషన్​ డిపార్ట్​మెంట్​(జీఏడీ).. జీవో విడుదల చేసింది.

"సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు(ఎస్​ఈబీసీ)గా గుర్తించిన మరాఠాలకు 10శాతం ఈడబ్ల్యూఎస్​ కోటా వర్తించనుంది. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించిన 2020 సెప్టెంబర్​ 9 నుంచి ఈ ఏడాది మే 5న తుది తీర్పు వెలువరించే సమయంలో ఈడబ్ల్యూఎస్​ కోటా వర్తిస్తుంది. స్టే విధించే ముందు పెండింగ్​లో ఉన్న ఎస్​ఈబీసీ అభ్యర్థుల నియామకాలకు వర్తిస్తుంది. కానీ, నియామకాలు, ప్రవేశాల్లో ఎస్​ఈబీసీ కోటా పొందిన వారికి వర్తించదు."

- మహారాష్ట్ర ప్రభుత్వం.

ఎలాంటి రిజర్వేషన్లు అందని ఆర్థికంగా వెనకబడిన వారికి ప్రస్తుతం 10శాతం ఈడబ్ల్యూఎస్​ కోటా అమలులో ఉంది. జనరల్​ కేటగిరీలోని పేద ప్రజలకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్​ కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్​ కోటాపై రెండున్నరేళ్ల క్రితం కేంద్రం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది.

దిలీప్​ బోస్లే కమిటీ సమయం పొడిగింపు..

మే 5న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన దిలీప్​ బోస్లే కమిటీ సమయాన్ని జూన్​ 7 వరకు పొడిగించింది మరాహాష్ట్ర ప్రభుత్వం. సోమవారంలోపే ఈ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ .. అది సాధ్యం కాకపోవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'మరాఠాలు ప్రబలమైన వర్గం- వారికి రిజర్వేషన్లు సరికాదు'

Last Updated :May 31, 2021, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.