ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడును భారీ వర్షాలు(Tamil Nadu Rain) ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెన్నైలో(Chennai Rain) రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరగా ప్రజలు అవస్థలు పడుతున్నారు.
వర్షాల కారణంగా తమిళనాడులో(Tamil Nadu Rain) ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు. 538 గుడిసెలు నేలమట్టమయ్యాయని.. నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు.
"తమిళనాడు వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 16.84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెంగల్పట్టు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈరోజు వర్ష ప్రభావం కాస్త తగ్గింది. దీంతో చెన్నై కార్పొరేషన్ లోతట్టు ప్రాంతాల్లోని నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, తమిళనాడు అగ్నిమాపక శాఖ.. సహాయక చర్యల్లో పాల్గొంటోంది. చెన్నైలో పరిస్థితిని సమీక్షించేందుకు, సహాయక చర్యలకు అంతరాయం లేకుండా చూసేందుకు.. అత్యధిక మంది నోడల్ అధికారులను నియమించాం."
-కేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, తమిళనాడు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి
సీఎం పర్యటన..
చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాలైన కొలాతుర్, విల్లివాక్కమ్ ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు. పరిస్థితిని పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల్లో బాధితులకు సహాయక సామగ్రి, ఆహారాన్ని అందజేశారు.
మదురై జిల్లాలో వర్షాలు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలను మరికొన్నిరోజుల పాటు మూసివేస్తున్నట్లు కలెక్టర్ మంగళవారం తెలిపారు.
మరోవైపు... నవంబరు 10 నుంచి నవంబరు 13 మధ్య చెన్నై తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
ఇదీ చూడండి: చెన్నైలో స్కూళ్లు బంద్- వరదలతో స్తంభించిన జనజీవనం