ETV Bharat / bharat

3 నెలల శిశువుకు అనారోగ్యం.. శరీరంపై వాతలు పెట్టి చికిత్స.. చివరికి..

author img

By

Published : Jan 26, 2023, 10:59 PM IST

Superstitious Beliefs
మూఢనమ్మకాలు

అనారోగ్యం బారిన పడిన చిన్నారికి మూఢ విశ్వాసంతో సొంతంగా వైద్యం చేసి ఆమె ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళ్తే..

శాస్త్రసాంకేతికతలు ఎంతగా అభివృద్ధి చెందినా.. కొందరు మాత్రం మూస పద్ధతుల్లో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ అంధవిశ్వాసాలను కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్​లోని షాహ్​డోల్​లో ఇలాంటి ఘటనే జరిగింది. అనారోగ్యం బారిన పడిన మూడు నెలల చిన్నారికి.. మూఢ నమ్మకంతో చేసిన చికిత్స ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని పురానీ బస్తీకి చెందిన ఓ మూడు నెలల చిన్నారికి జబ్బు చేసింది. నిమోనియా, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి చిన్నారి ఏదో ఒక రకంగా అనారోగ్యంతో ఉండేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే, సాధారణ వైద్యం కాకుండా మూఢ నమ్మకాలపై వీరు విశ్వాసం ఉంచారు. ఆరోగ్యం బాగుపడుతుందని భావించి చిన్నారికి వేడివేడి ఐరన్ రాడ్​తో వాతలు పెట్టారు. శరీరంలో 51 చోట్ల వేడి కడ్డీతో కాల్చారు. దీంతో చిన్నారి మరింత అనారోగ్యానికి గురైంది. బంధువులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం షాహ్​డోల్ మెడికల్ కళాశాల వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

'మా దృష్టికి రాలేదు'
అయితే, ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటన ఇంకా తమ దృష్టికి రాలేదని షాహ్​డోల్ కలెక్టర్ వందన వైద్య చెప్పారు. అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అధికారులు జిల్లాలో గతంలోనూ అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించారని, అయినప్పటికీ చాలా మంది ప్రజల్లో మార్పు లేదని స్థానికులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.