ETV Bharat / bharat

లోన్ యాప్స్ పేరిట మోసం.. రూ.300 కోట్లు స్వాహా.. నిందితులంతా చైనీయులే!

author img

By

Published : Jan 12, 2023, 11:41 AM IST

fake chinese apps
లోన్ యాప్​లు

తక్కువ వడ్డీకే లోన్​ల పేరిట మోసాలకు పాల్పడి రూ.300 కోట్లు దోచుకున్న ముఠాను పోలీసులు గుర్తించారు. అందులో ఐదుగురు సభ్యులు చైనీయులేనని తెలిపారు. ఓ నిందితుడిని అరెస్ట్​ చేసి ల్యాప్​టాప్​, ఫోన్​ సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

చైనీస్ లోన్ యాప్​ల పేరిట సైబర్​ మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్జాతీయ ముఠాను గుర్తించారు ఉత్తరాఖండ్ టాస్క్​ఫోర్స్ అధికారులు. ఈ కేసులో దిల్లీకి చెందిన అంకుర్ ధింగ్రీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ల్యాప్​టాప్​, ఫోన్​, హార్డ్ డిస్క్, పదులకొద్ది బ్యాంకు ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, మెట్రో కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ముఠాలో ఉన్న ఐదుగురు సభ్యులు చైనీయులే అని పోలీసులు తెలిపారు. వీరు హాంకాంగ్​ నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

"తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని.. యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని వినియోగదారులను సైబర్ నేరగాళ్లు మెసేజ్​లు పంపుతారు. ఆ యాప్​లను డౌన్​లోడ్ చేసుకోగానే వినియోగదారుల మొబైల్​లో ఉన్న ఫొటోలు, వీడియోలు సైబర్ నేరగాళ్లకు చేరిపోతాయి. దీంతో వినియోగదారుడు, అతడి కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరమైన ఎడిట్ చేసి బ్లాక్​మెయిల్ చేస్తారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే బాధితుల వ్యక్తిగత చిత్రాలను ఇంటర్నెట్​లో పెడతామని బెదిరిస్తారు. ఈ సైబర్ నేరగాళ్లు 15 నకిలీ లోన్ యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు"

-- స్పెషల్ టాస్క్​ఫోర్స్ అధికారులు

చైనా నకిలీ లోన్ యాప్​కు సంబంధించి ఉత్తరాఖండ్​లో ఇప్పటివరకు 247 కేసులు నమోదయ్యాయని స్పెషల్​ టాస్క్​ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న చైనా పౌరులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భారత విదేశాంగ శాఖకు లేఖ రాశామని పేర్కొన్నారు. నిందితుడు ధింగ్రీ నకిలీ లోన్ యాప్​తో దేశవ్యాప్తంగా రూ.300 కోట్ల మోసానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. హాంకాంగ్‌ వేదికగా ఐదుగురు చైనీయులు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

fake chinese apps
నిందితుడిని అదుపులోకి తీసుకున్న టాస్క్​ఫోర్స్ అధికారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.