స్పందన లేని సామాజిక సాధికార బస్సు యాత్ర..నిరాశతో వైసీపీ నాయకులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 9:31 AM IST
YSRCP Bus Yatra in Kakinada : వైసీపీ చేపట్టిన 'సామాజిక సాధికార యాత్ర' కు స్పందన కొరవడింది. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం సర్పవరం కూడలిలో సోమవారం వైసీపీ చేపట్టిన బస్సు యాత్ర, బహిరంగ సభకు జనం ఆదరణ కరవైంది. సంక్షేమ పథకాలు తీసుకుంటున్నవారు, డ్యాక్రా మహిళలు జగన్ బస్సు యాత్రకు తరలి రావాలని నాయకులు పేర్కొన్నారు. యానిమేటర్లులకు, వాలంటీర్లులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు పాఠశాల బస్సులు, ఆటోలను ఏర్పాటు చేశారు. నాయకుల ప్రసంగాలు ప్రారంభం కాగానే ..ప్రజలు గుంపులు గుంపులుగా ఇంటి బాట పట్టారు. వారిని నిలువరించేందుకు నాయకులు, పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బారికేడ్లులను, బస్సులను అడ్డంగా పెట్టినా ఎలాంటి ఫలితం లేదు. ప్రసంగాలు పూర్తయ్యే వరకు ఆగాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. సభ ముగిసే సరికి పలచగా జనం, ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం వైసీపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది.
ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీకి సిగ్నలింగ్ లైట్ల అడ్డంగా ఉందని తొలగించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా రంగరాయ వైద్యకళాశాల, జేఎన్టీయూకే మధ్యలో వస్తున్న బస్సు ఒక్కసారిగా ఓ వైపు వాలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, నాయకులు కొందరిని బస్సులోంచి కిందికి దింపేశారు.