YCP Activist on MP ఆ ఎంపీ వల్ల తీవ్రంగా నష్టపోయాను ఆదుకోండి: వైసీపీ కార్యకర్త
YCP Activist video on MP Rangayya irregularities: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని నెలలుగా అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న మోసాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా సింగనమలకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త బయన్న ఎంపీ రంగయ్య వల్ల తాను దారుణంగా నష్టపోయానంటూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఎంపీ రంగయ్య చేసిన మోసం గురించి బయన్న వివరించారు.
ఎంపీ రంగయ్యపై ఫిర్యాదుకు సిద్దమైన బయన్న.. ఆ వీడియోలో ఉన్న ప్రకారం.. ''అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ ఎంపీ రంగయ్య వల్ల నేను తీవ్రంగా నష్టపోయాను. పార్టీ ప్రారంభించిన రోజు నుంచి ఆస్తులన్నీ అమ్ముకుని పార్టీ కోసం కష్టపడ్డాను. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఎంపీ రంగయ్య నన్ను పట్టించుకోవడంలేదు. కరోనా సమయంలో రోగుల కోసం షెడ్డులు ఏర్పాటు చేస్తే..నాకు నెలకు రూ.30 వేలు ఇస్తానని చెప్పి, మోసం చేశాడు. డబ్బులు చెల్లించకుండా తిప్పించుకుంటున్నాడు. ఇప్పటివరకు నాకు ఏ మాత్రం నగదు చెల్లించకుండా, కనీసం కలవనీయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి ముఖ్యమంత్రి జగన్ స్పందించి.. నాకు, నా కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నాను. ఎంపీ రంగయ్యను సీఎం కార్యాలయానికి పిలుపించి, నా డబ్బులు తిరిగి ఇచ్చేలా సహాయం చేయాలని కోరుతున్నాను.'' అంటూ బయన్న వీడియోలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బయన్న ఎంపీ రంగయ్య పై తనకు చేసిన మోసాన్ని గురించి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడానికి ముఖ్యమంత్రి కార్యాలయ సమీపంలో ఉన్నట్లు సమాచారం.