'తిప్పారెడ్డి బోర్డు తిప్పేశాడు' రైతులను నిండాముంచిన వైసీపీ సర్పంచ్ కొడుకు - ₹15కోట్లతో అదృశ్యం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 2:18 PM IST
|Updated : Dec 7, 2023, 3:13 PM IST
YCP Leader Absconded with Farmers Money: రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి, వారికి (రైతులకు) చెల్లించాల్సిన డబ్బులతో ఓ వైసీపీ నాయకుడు కుటుంబ సభ్యులతో సహా పరారైన సంఘటన అనంతపురం జిల్లాలో సంచలనంగా మారింది. సుమారు 150 మంది నుంచి పప్పు శెనగ పంటను కొనుగోలు చేసి, తమకు చెల్లించాల్సిన 15 కోట్ల రూపాయలతో ఉడాయించాడని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. వ్యాపారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ కనేకల్ పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.
జరిగిన సంఘటన ఇది: అనంతపురం జిల్లా కనేకల్ మండలం మాల్యం గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ నరసమ్మ కుమారుడు తిప్పారెడ్డి కొన్నేళ్లుగా పప్పు శెనగల వ్యాపారం చేస్తున్నాడు. తిప్పారెడ్డి సర్పంచ్ కుమారుడు కావడంతో సొల్లాపురం, ఎన్ హనుమాపురం, మాల్యం, హనకనహాల్, ఉరవకొండ మండలం నింబగల్లు రాయంపల్లి, విడపనకల్లు గ్రామాలకు చెందిన సుమారు 150 మంది రైతుల నుంచి ఏడాది కాలంగా పప్పు శెనగ పంటను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో రైతుల నుంచి సేకరించిన పంటకు తిప్పారెడ్డి రూ.5వేలు చెల్లిస్తూ మార్కెట్లో క్వింటా రూ.6 వేల చొప్పున విక్రయించేవాడు. సుమారు 15 వేల క్వింటాళ్లు విక్రయించి, సొమ్ము చేసుకున్నాడు. అయితే, రైతులు డబ్బులు ఇవ్వాలని కోరగా ఈరోజు, రేపు అంటూ కాలం వెళ్లి తీసుకు వచ్చాడు. తాజాగా కొంతమంది రైతులు డబ్బులు చెల్లించకపోవడంతో కనేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో తాను ఎక్కడికి వెళ్లనని పోలీసులను నమ్మబలికాడు. ఆ తర్వాత వారం గడవక ముందే భార్యా పిల్లలతో ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిప్పారెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 150 మంది రైతులకు రూ. 15 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.