Two Students Died in Road Accident : రెండు వాహనాల ఢీ.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం..
Two Students Died in Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. జిల్లాలోని రొద్దం మండలం చిన్న కోడి పల్లి గ్రామానికి చెందిన జస్వంత్(16), ఈశ్వర్(16)లు శనివారం ఉదయం స్నేహితుడు రాముతో కలిసి ద్విచక్ర వాహనంపై కర్ణాటకలోని పావగడ పట్టణంలో గల శనేశ్వర స్వామి దేవాలయానికి బయలు దేరారు. మార్గమధ్యంలో కర్ణాటక సరిహద్దులోని కడమలకుంట వద్ద ఎదురుగా వచ్చిన బొలెరో వాహనాన్ని బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జస్వంత్ , ఈశ్వర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రాముని పావగడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు పదవ తరగతి అభ్యసిస్తుండగా.. రాము ఇంటర్ చదువుతున్నాడు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పావగడలోని ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి.