సర్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: పురందేశ్వరి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 6:04 PM IST
Purandeswari Fires On YCP Government: మిగ్జాం తుపాను వల్ల సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులన్నా, వ్యవసాయమన్నా అధికార పార్టీకి ఎందుకంత చిన్నచూపని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయని పురందేశ్వరి విమర్శించారు. ఏలూరు జిల్లా భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పురందేశ్వరి పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టానికి సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సంచులు ఇవ్వకపోవడంతో చేతికి వచ్చిన పంటను కోల్పోతున్నామని అన్నదాతలు తమ గోడును పురందేశ్వరికి చెప్పుకున్నారు.
రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుకి భరోసా కల్పించేటటువంటి అవకాశం ఏ మాత్రం కనిపించటం లేదు. రైతులకు న్యాయం జరిగేటటు పరిస్థితి కనిపించట్లేదు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం అనే భరోసా ఇచ్చేటటు వంటి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కటి కూడా రాలేదు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 50వేల రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.-పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు