Housing in Capital lands చంద్రబాబు కట్టిన ఇళ్లను చూడండి.. సెంటు భూమిలో కడుతున్న ఇళ్లను చూడండి: టీడీపీ నేత నిమ్మల
Published: May 20, 2023, 7:27 PM

Amaravati Capital: ఎలక్ట్రానిక్ సిటీ నిర్మాణానికి కేటాయించిన భూమిలోనే జగన్ సెంటుపట్టాలు ఇవ్వడం ప్రజారాజధాని విచ్ఛిన్నానికేనని తెలుగుదేశం శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. జగన్కు నిజంగా పేదలకు ఇళ్లు ఇవ్వాలని ఉంటే, రాజధానిలో పేదలఇళ్ల నిర్మాణానికి కేటాయించిన ప్రదేశంలోనే ఇవ్వొచ్చుకదా అని నిలదీశారు.
చంద్రబాబు కట్టిన ఇళ్లు.. పేదవాడు కూడా ధనవంతుడిమాదిరిగా నివసించాలని 2/2 వెర్టిఫైడ్ టైల్స్, గ్రానైట్ కిచెన్ ఫ్లాట్ ఫామ్, ఎస్.ఎస్.షింక్, వాల్ పుట్టీవేసిన గోడలు, టైల్స్, వెస్ట్రన్ కమోడ్ తోకూడిన బాత్రూమ్, కప్ బోర్డ్స్, ఎలక్ట్రిఫికేషన్, ప్లంబింగ్ తోకూడిన ఇళ్లునిర్మించి ఉచితంగా పేదలకు అందించాలనుకున్నారని నిమ్మల గుర్తుచేశారు. పనికిరాని సెంటు ముంపు పట్టా ఇచ్చి చేతులు దులుపుకుంటున్న జగన్ పేదలపక్షపాతా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సెంటుపట్టాల పేరుతో గాలివెలుతురు, విశాలమైనరోడ్లు, డ్రైనేజ్ లేకుండా 48గజాల్లో కాళ్లచాపుకోవడానికి వీల్లేని ఇళ్లు ఇస్తానంటున్న జగన్ పేదలపక్షపాతా అని దుయ్యబట్టారు. జగన్ పేదలకు నిర్మిస్తానంటున్నఇళ్లకంటే, ఆయన ప్యాలెస్ లోని బాత్రూమ్ విస్తీర్ణమే ఎక్కువని ఎద్దేవాచేశారు.
పేదలకు న్యాయంచేస్తాడా?: చంద్రబాబు రాజధానిమొత్తం భూమిలో 5శాతంభూమిని పేదలనివాసానికే కేటాయిస్తే, అదికాదని నవనగర నిర్మాణాలకు విరుద్ధంగా ఇళ్లపట్టాలివ్సాల్సిన అవసరం ఏమొచ్చిందనీ నిమ్మల ప్రశ్నించారు. రాజధాని నిర్మాణప్రణాళికకు భిన్నంగా, వివాదాస్పద స్థలాల్లో పేదలకు పనికిరాని సెంటుపట్టా ఇవ్వడం వారిని మోసగించడం, దగాచేయడం కాదా అని ఆక్షేపించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయంచేయని ముఖ్యమంత్రి, పేదలకు న్యాయంచేస్తాడా అని నిమ్మల మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ధనవంతుల ఇళ్లమాదిరిగా పేదలకు అన్నిసౌకర్యాలతో, అధునాతన హంగులతో ఉచితంగా టిడ్కోఇళ్లు నిర్మించిన చంద్రబాబు పేదలపక్షపాతి నిమ్మల గుర్తుచేశారు.