Visakha Steel plant: విశాఖ ఉక్కుకు జాతీయ పురస్కారం.. వారి కృషితోనే సాధ్యమైందన్న ఉక్కు సీఎండీ
National Award for Visakha Steel Plant : రాష్ట్రంలో దశాబ్దాల పోరాటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను సాధించుకున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా కార్మికులు దీర్ఘ కాలం నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. విశాఖ ప్లాంట్కు సంబంధించిన బిడ్ల వ్యవహారం గతంలో తీవ్రచర్చనీయాశం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం సైతం బిడ్ వేసేందుకు ముందుకు వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇటువంటి సందర్భంలో విశాఖ ఉక్కుకు జాతీయ పురస్కారం రావడంతో కార్మికులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంస్థ ఖర్చుల నిర్వహణలో తీసుకున్న అత్యుత్తమ చర్యలకు గుర్తింపుగా విశాఖ స్టీల్ ప్లాంట్కు పురస్కారం వచ్చిందని సంస్థ వర్గాలు తెలిపాయి. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 23న జరిగిన 18వ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్-2022 కార్యక్రమంలో ఇండియన్ కంప్యూటర్ ఈఆర్టీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ చేతుల మీదుగా ఉక్కు సీజీఎం వి.శాంత కుమార్, డీజీఎం డి.చిన్నారావు పురస్కారాన్ని అందుకున్నారు. కార్మికులు, ఉద్యోగుల కృషితోనే పురస్కారాలు అందుతున్నాయని ఉక్కు సీఎండీ అతుల్భట్ వారిని ప్రశంసించారు.