Marigold Farmers Gets Loss: నష్టాల ఊబిలో చిక్కుకున్న ముద్దబంతిపూల రైతులు.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు..
Marigold Farmers Gets Loss: ముద్దబంతి దిగుబడి చూస్తే అధికం. ధరలేమో పతనం. రోజులు గడిచినా కొనేవారు రాకపోవడంతో మహా నగరాల్లోని మార్కెట్లోనే పూలను పారేసే పరిస్థితి. రవాణా ఖర్చులకు సరితూగని మార్కెట్ ధరలు పలకకపోవడంతో మిగిలిన పూలను రైతులు కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు వందల ఎకరాల్లో ముద్దబంతి పూల సాగు చేశారు. పూల కోత రెండు విడతలు వచ్చే విధంగా చెట్లను పెంచారు. అనుకున్న సమయానికి పంట అధిక దిగుబడి వచ్చింది. మొదటి విడతగా వరలక్ష్మీ వ్రత పండుగ సమయంలో బంతిపూలను కోసి హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లోని మార్కెట్కు బాడుగ వాహనాలలో పూలను తరలించారు. మార్కెట్లో ముద్ద బంతిపూలు కిలో కేవలం 10 నుంచి 15 రూపాయల ధర మాత్రమే పలికింది. అంతేకాక వెళ్లిన మొత్తం సరుకులో సగభాగం మాత్రమే మొదటి రోజు అమ్ముడైంది. మరుసటిరోజు గడుస్తున్నా మిగిలిన సగభాగం పూలు కొనేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో పూలు వాడిపోయాయి. ఇక రైతులు చేసేదిలేక వాటిని మార్కెట్లో పారబోశారు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వందల ఎకరాల్లో ఉన్న రెండవ విడత కోయాల్సిన పూలను రైతులు కోయకుండా పొలాల్లోనే వదిలేశామని వాపోయారు. అప్పులు తెచ్చి బంతిపూల సాగుపై పెట్టుబడులు పెట్టగా.. గిట్టుబాటు ధరలులేక అప్పుల ఊబిలో చిక్కుకునిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.