Frauding Retailers in the Name of Subsidized Loans: రాయితీ రుణాల పేరుతో కుచ్చుటోపీ.. రూ.30 లక్షలతో పరారైన మోసగాడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 1:41 PM IST
|Updated : Oct 7, 2023, 5:00 PM IST
Frauding Retailers in the Name of Subsidized Loans: బ్యాంకులో రాయితీ రుణాలను మంజూరు చేయిస్తానంటూ ఓ మోసగాడు చిరువ్యాపారులకు కుచ్చుటోపి పెట్టిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన శేఖర్ బాబు ఉరవకొండలో మార్కండేయ ఆలయ సమీపంలో నివాసం ఉండేవాడు. తనకు బ్యాంకులతో సత్సంబంధాలు ఉన్నాయని, రాయితీ రుణాలు ఇప్పిస్తానంటూ 8 నెలలుగా చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు తెర తీశాడు. అతని మాటలను నమ్మిన చిరు వ్యాపారుల దగ్గర రూ.30 లక్షల వరకు వసూలు చేసి పరారయ్యాడు. అలా నమ్మిన చిరు వ్యాపారులు అతను అడిగే కొద్దీ నగదును ఇచ్చారు. వారికి ఈ నెల 3న రుణాలు బ్యాంకుల్లో జమ అవుతాయని తెలిపారు. అయితే అతను ఈనెల 2న రాత్రి కుటుంబంతో పాటు ఇంట్లోని సామాగ్రితో సహా పరారయ్యాడు. దీనిని గుర్తించిన బాధితులు లబోదిబోమంటున్నారు. కొందరికి మోసగాడు చెల్లని చెక్కులు ఇచ్చాడు. దాదాపు 8 మంది బాధితులు ఈ విషయంపై ఉరవకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల సంఖ్య ఇంకా అధికంగా ఉందని,దాదాపు రూ.కోటికి పైగా మోసం చేసి ఉండవచ్చని సమాచారం.