నరసాపురం పురపాలక సంఘం ఆవరణలో అగ్నిప్రమాదం - కారణం తెలిపిన అగ్నిమాపక సిబ్బంది
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 10:03 PM IST
Fire Accident in Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ నిల్వ ఉంచి పాత వాహనాలు ప్రమాదంలో దగ్ధమయ్యాయి. వీటికి వేలం పాట నిర్వహించి విక్రయించే యోచనలో పురపాలక సంఘం అధికారులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి.. వచ్చి మంటలను అదుపుచేయటంతో పెను ప్రమాదం తప్పింది. పరిసర ప్రాంతంలో చెత్తను అంటించిన సిబ్బంది.. దాన్ని ఆర్పకుండా వెళ్ళటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
మున్సిపల్ కార్యాలయం వెనక అనేక వస్తువులు నిల్వ చేసి ఉన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.. అక్కడ ఉన్న చెత్తను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేసి కాలబెట్టడంతో పక్కన ఉన్న వస్తువులకు మంటలు అంటుకున్నాయని వారు వివరించారు. సమాచారం రావడంతోనే హూటాహూటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పినట్లు వారు వివరించారు.
"పురపాలక సంఘం కార్యాలయం వెనక భాగంలో ఈ రోజు క్లీనింగ్ వర్క్ జరిగింది. పనికిరాని వస్తువులను శుభ్రం చేసే క్రమంలో చెత్తను మా సిబ్బంది కాలబెట్టారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. ఫెక్సీలవంటివి ఉండటం వల్ల మంటలు అధికంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెప్తుతున్నారు." -వెంకటేశ్వర్లు