ముగ్గురు కుమార్తెలకు పురుగుల మందు తాగించి - ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 10:55 PM IST
Father Poisoned his Three Daughters in Anantapur District : కన్న కుమార్తెలకు పురుగుల మందు తాగించి తాను కూడా సేవించి తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని శెట్టూరు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ గుమ్మ గట్ట మండలంలో పులికుంట గ్రామానికి చెందిన గీతమ్మతో తొమ్మిది ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు గంగోత్రి (8), కావేరి (6), కీర్తి (2) ఉన్నారు. అయితే తండ్రి గంగాధర్ ముగ్గురు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై రాయదుర్గం శివారు ప్రాంతమైన సిద్ధలకొండ వద్దకు వెళ్లాడు.
అప్పటికే తీసుకువెళ్లిన పురుగుల మందుని కూల్ డ్రింక్లో కలిపి ముగ్గురు కుమార్తెలకు తాగించడంతో పాటు తానూ సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం ఈ విషయాన్ని ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చాడు. అంతలోనే అక్కడే ఉన్న పశువుల కాపరులు గుర్తించి అపస్మారక స్థితిలో ఉన్న వారందరినీ చికిత్స నిమిత్తం రాయదుర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TAGGED:
అనంతపురం జిల్లా వార్తలు