Dharmana Comments on Infrastructure : రోడ్లు వేయడం ఒక్కటే అభివృద్ధి కాదు : మంత్రి ధర్మాన
Dharmana Comments on Infrastructure : గుంటూరు జిల్లాలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల అభివృద్ధి కమిటీ సమావేశాలకు బుధవారం అధికారులతో హాజరైన రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భౌతిక అభివృద్ధి కంటే జీవన ప్రమాణాలు పెరగటమే నిజమైన అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. విపక్షాలు చెబుతున్నట్లు రోడ్లు వేయటం ఒక్కటే అభివృద్ధి కాదన్నారు. అసలు ఇళ్లే లేకపోతే ఎవరూ అడగరని.. ఇళ్లు కట్టిన తర్వాత రోడ్డు, డ్రైనేజీ ఇలా అడుగుతారన్నారు. అలా అడగటం ప్రజల హక్కేనని.. అంత మాత్రానికి మనమేం చేయలేదని బాధపడాల్సిన పనిలేదనన్నారు. గుంటూరు నగరంలో మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా అధికారులు చొరవ చూపి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఓవర్ బ్రిడ్జిలు, ఆర్యూబీలు, రహదారుల విస్తరణ, మానస సరోవరం, బీఆర్ స్టేడియం, జీజీహెచ్, యూజీడీ పనులపై చర్చించారు. సమావేశంలో సంయుక్త కలెక్టరు జి.రాజకుమారి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి, డీఆర్వో చంద్రశేఖరరావు.. పలువురు అధికారులు హాజరయ్యారు.
TAGGED:
గుంటూరు కలెక్టరేట్ న్యూస్