CM Jagan Silent In Krishna Water Disputes : రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. సీఎం స్పందించడం లేదు: రైతుసంఘాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 10:20 AM IST
CM Jagan Silent In Krishna Water Disputes : కృష్ణా జలాల పంపకాలపై పునఃసమీక్షకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో రైతుసంఘం నాయకులు నిరసన తెలిపారు. కళ్లముందే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్ నోరు మెదపడం లేదన్నారు. తన కేసుల కోసమే కేంద్రంతో రాజీపడి రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి నీటి కేటాయింపులు ఖరారు చేయాలని.. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు డిమాండ్ చేశారు. ఆ తర్వాతే విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ నీటిని పంచాలన్నారు.
సుప్రీం కోర్టులో కేసు వేసి కృష్ణా జలాల పునః సమీక్ష నిర్ణయాన్ని అడ్డుకోవాలి : విశ్రాంత ఇంజినీర్లు కృష్ణా జలాల పంపకాల పునః సమీక్ష నిర్ణయంపై నవ్యాంధ్ర విశ్రాంత ఇంజనీర్ల అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా విశ్రాంత ఇంజనీర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సుప్రీం కోర్టులో కేసు వేసి కృష్ణా జలాల పునః సమీక్ష నిర్ణయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులకు బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులు చేయలేదని స్పష్టం చేసారు. ఈ అంశంపై ఇప్పటికే నవ్యాంధ్ర విశ్రాంత ఇంజనీర్ల అసోసియేషన్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం ఏపీకి కేటాయించిన జలాల హక్కుకు రక్షణ కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు.