విభజనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం - పదేళ్లయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: సీఎం జగన్
Published: Nov 20, 2023, 6:58 PM

CM Jagan Review on AP Redistricting Act Promises: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో.. 13వ షెడ్యూల్, ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ, భవనాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
CM Jagan Comments: ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలుతోపాటు 13వ షెడ్యూల్లోని సంస్థల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హామీలపై నియమించిన ప్రత్యేక అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి సమీక్షకు హాజరయ్యారు. ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఎం సహా పెట్రోలియం యూనివర్సిటీకి సంబంధించిన పూర్తిస్థాయి భవనాలు, కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన నిధుల కేటాయింపుపై సీఎం చర్చించారు. అనంతరం విభజన హామీల్లో కీలకమైన పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్ చర్చించారు. మరోవైపు హెచ్పీసీఎల్ (H.P.C.L) రిఫైనరీ, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్తోపాటు మెట్రో రైల్ ప్రాజెక్టుల అంశాలపై అధికారులతో సమీక్షించారు.
''విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరిగింది. పదేళ్లు అవుతున్నా..విభజన చట్టం హామీలు పరిష్కారం కాలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్రానిదే. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధుల హామీ ఇంకా నెరవేరలేదు. తెలంగాణ నుంచి ఏపీకి విద్యుత్ బకాయిలు ఇంకా రాలేదు. విశాఖ-రాయలసీమ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలి. రైల్వే జోన్, విశాఖ మెట్రోపై రేపటి సమావేశంలో చర్చించాలి.''-వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం