Clarification on Telugu Desam Party Funds: తమ పార్టీకి నిధులు ఎలా వచ్చాయో తెలిపిన టీడీపీ నేతలు.. వైసీపీకి సూటి ప్రశ్న
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 9:46 PM IST
Clarification on Telugu Desam Party Funds: రాష్ట్రవ్యాప్తంగా 1300 బ్యాంక్ ఖాతాలు.. 60 లక్షలకు పైగా క్రియాశీల సభ్యులైన కార్యకర్తల ద్వారా.. పార్టీకి సభ్యత్వ రుసుముల రూపంలో నిధులు వచ్చాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తి పారదర్శకతతో ప్రజల ముందు, ఎన్నికల కమిషన్ ముందు ఉంచుతోందని తెలిపారు. జగన్ రెడ్డి ముఠా ఆరోపిస్తున్నట్టు.. షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశానికి రూ. 27 కోట్లు వచ్చాయనడం పచ్చి అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీకి 2016-17లో వివిధ కంపెనీల నుంచి వచ్చిన విరాళాలు కేవలం రూ. 27 లక్షలు మాత్రమేనని పార్టీకి చెందిన ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులు చెబుతున్నాయని పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఏయే మార్గాల్లో ఎంతెంత సొమ్ము వచ్చిందనే వివరాలను ఇన్ కంటాక్స్ డిపార్ట్మెంట్కు, ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా తెలియజేశామన్నారు. టీడీపీతో పోలిస్తే, సరైన కార్యకర్తలే లేని వైసీపీ.. విరాళాల సేకరణలో జాతీయ స్థాయిలో 5వ స్థానంలో.. ప్రాంతీయ పార్టీల జాబితాలో అగ్రస్థానంలో ఎలా నిలిచిందో జగన్ రెడ్డికే తెలియాలని ధ్వజమెత్తారు.