Bojja Dasaratharami Reddy Fires on CM Jagan: కృష్ణా జలాల పంపిణీపై పునఃసమీక్ష నిర్ణయం .. ఏపీకి బ్లాక్ డే : దశరథరామిరెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 10:33 AM IST

thumbnail

Bojja Dasaratharami Reddy Fires on CM Jagan : రాష్ట్ర నీటి హక్కుల రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. రాయలసీమ తాగు, సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల పంపిణీపై పునఃసమీక్ష నిర్ణయాన్ని (CM Jagan Review on Krishna Water Distribution) కేంద్రం వెనక్కి తీసుకునేలా సీఎం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వాటాల సాధన కోసం అన్ని పార్టీలూ గళమెత్తాలని పిలుపునిచ్చారు.

సాగునీరు పంపిణీ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రాయలసీమకు అన్యాయం జరుగుతుందని రాయలసీమ తాగు, సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి ఎందుకు స్పందించలేదన్నారు. జగన్ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. దిల్లీలో దీక్ష చేసి పోరాటం చేయాలని.. లేకపోతే సీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బొజ్జా వివరించారు.

కృష్ణా జలాల వినియోగంపై నూతన జీవో రాష్ట్ర హక్కులకు చీకటి జీవో అని తక్షణమే ఉపసంహరణ జరిగేలా ముఖ్యమంత్రే స్వయంగా చర్యలు చేపట్టాలని బొజ్జ దశరధ రామిరెడ్డి డిమాండ్ చేశారు. హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలన్నీ గళమెత్తాలని పిలుపునిచ్చారు. రాయలసీమ హక్కులను కాలరాస్తున్న పాలకుల వైఫల్యాలపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి హక్కులను హరించివేసే దిశగా భారతీయ జనతా పార్టీ దూకుడును అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ రాజకీయ స్వార్థం కోసం రాయలసీమ హక్కులను తాకట్టు పెట్టే చర్యలను, పాలకుల వైఫల్యాలను ప్రజా క్షేత్రంలోకి తీసుకెల్లి ఎండగడుతామని దశరథరామిరెడ్డి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.