BJP Mahila Morcha నిధులు కేంద్రానివి.. జగన్ ఫోటోతో ప్రచారం! మండిపడిన బీజేపీ మహిళా మోర్చా..
BJP Mahila Morcha: కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల అమలు ఆశాజనకంగా లేదని బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఉరవకొండ ఆస్పత్రి, అనంతపురంలో వసతి గృహాలను పరిశీలించిన నేతలు సదుపాయాల కొరత ఉందన్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఇస్తున్న తీరును పరిశీలించగా కందిపప్పు, పాలు నాణ్యతగా లేవన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న ప్రతి వస్తువు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రయోజనం చేకూర్చుతున్నా.. వాటిపైనా సీఎం జగన్ ఫొటొ ఉందని ఆగ్రహించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై పర్యటించిన బీజేపీ మహిళ మోర్చ బృందం క్షేత్రస్థాయిలో అనేక విషయాలు గుర్తించింది. అంగన్ వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని.. శిథిలమైన వాటిలో కొనసాగిస్తున్నారని అన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతల పరిస్థితి, వసతి గృహాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందుతున్న ప్రయోజనాలను సైతం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో కేంద్ర పథకాలు అమలవుతున్న పరిస్థితిపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి నివేదిక ఇవ్వనుననట్లు.. పరిశీలనకు వచ్చిన మహిళా సభ్యులు చెప్పారు.