21 బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు - సీఎం జగన్ బీసీల ద్రోహి: అచ్చెన్నాయుడు
Published: Nov 15, 2023, 4:47 PM

Achchennaidu Hot Comments on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 21 బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు చేసిన బీసీల ద్రోహి జగన్ అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ఒక కులాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
Achchennaidu Comments: ''జగన్ మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని మొదటి నుంచి టీడీపీ చెప్తూనే ఉంది. రాష్ట్రంలోని 21 బీసీ కులాలకు భౌగోళిక పరిమితులు రద్దు చేయడమంటే వారి వెన్నెముక విరిచినట్లే. జీవనోపాధి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లేవారి పరిస్థితి ఏంటి..? జగన్ తీసుకున్న నిర్ణయంతో 21 బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కులాలకు ఉన్న పరిమితులు రద్దు చేయడం వల్ల విద్య, వైద్యం, రాజకీయంతో పాటు అన్ని విధాలా నష్టపోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు రిజర్వేషన్లు కోల్పోవడంతో పాటు విద్యాపరంగా తీవ్రంగా నష్టపోతారు. ప్రస్తుతం ఉన్న విధానంతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..?. ఒక కులాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం వల్ల 16,800 పదవులను బీసీలు కోల్పోయారు. బీసీలకు పీజీ చదువులకు రీయింబర్స్మెంట్ రద్దు చేశారు. విదేశీ విద్య దూరం చేశారు.. కార్పొరేషన్లు నాశనం చేసి బీసీలను రోడ్డున పడేశారు. 74 మంది బీసీలను హత్య చేశారు. ఇప్పుడు భౌగోళిక పరిమితులు రద్దు చేసి మరో అన్యాయానికి ఒడిగట్టారు'' అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.