ETV Bharat / state

కటారి హేమలత పట్ల పోలీసుల తీరు దారుణం.. ఆ అధికారులపై చర్యలకు తెదేపా డిమాండ్​

author img

By

Published : Jun 24, 2022, 6:09 PM IST

TDP protest: మాజీ మేయర్ కటారి హేమలత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తెదేపా నేతలు ఖండించారు. ఆమెపై పోలీసుల తీరును నిరసిస్తూ.. తెదేపా శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. కటారి హేమలతకు న్యాయం చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీకి వినతపత్రం అందజేశారు. మరోవైపు రాయచోటి మున్సిపల్​ కమిషనర్​పై కౌన్సిలర్ల దాడిని ఉద్యోగులు ఖండించారు.

farmer mayor katari hemalatha
farmer mayor katari hemalatha

TDP Protest: మాజీ మేయర్ కటారి హేమలతపై పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ.. చిత్తూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పలమనేరు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం కలగడంతోపాటు ట్రాఫిక్​ స్తంభించిపోయింది. ఈ క్రమంలో తెదేపా నేతలు, కార్యకర్తలు.. పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో తెదేపా నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా లాగి వ్యాన్​ ఎక్కించారు. అనంతరం సొంత పూచీకత్తుపై తెదేపా నేతలు, కార్యకర్తలను పోలీసులు విడిచి పెట్టారు. కటారి హేమలతకు న్యాయం చేయాలని అమరనాథ్​రెడ్డి డిమాండ్ చేశారు.

TDP leaders Meet SP: కటారి హేమలత అంశంపై మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, తెదేపా నేతలు.. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిని కలిసి వినతపత్రం అందజేశారు. హేమలత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఎస్సీకి వివరించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎస్పీ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

ప్రజలే తగిన బుద్ధి చెప్తారు: రాష్ట్రంలో వైకాపా అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మేయర్​ హేమలతను అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు పరామర్శించారు. మాజీ మేయర్ అనురాధ దంపతుల హత్య కేసును నీరు గార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అమరనాథ్​రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే కేసులో సాక్షులపై తప్పుడు కేసులు బనాయిచారని మండిపడ్డారు. భర్తను పోగొట్టుకుని వైకాపా అరాచకాలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్న ఒంటరి మహిళ హేమలతపై పోలీసుల తీరు దారుణంగా ఉందన్నారు. ఆ ఘటనకు బాధ్యులను చేస్తూ.. రెండో పట్టణ సీఐనీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకుల అరాచకాలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. మరో రెండేళ్లలో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

రాయచోటి కమిషనర్​పై దాడిని ఖండించిన ఉద్యోగులు: రాయచోటి మున్సిపల్​ కమిషనర్​పై కొన్సిలర్లు జరిగిన దాడిని నిరసిస్తూ.. బాపట్ల జిల్లా చీరాల, బాపట్లలో మున్సిపల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్​పై దాడిని ఖండిస్తూ.. చీరాల పురపాలక సంఘం భవనం ఎదుట ఉద్యొగులు నినాదాలు చేశారు. కమిషనర్​పై కౌన్సిలర్లు దాడి అమానుషమైన ఘటన అని ఉద్యోగుల సంఘం ప్రతినిధి మాల్యాద్రి అన్నారు. ఏదైనా ఉంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి కానీ.. భౌతిక దాడులకు దిగడంతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతారన్నారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.