ETV Bharat / state

అందరి వేళ్లు.. ఆయన వైపే..! వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్​

author img

By

Published : Feb 24, 2023, 8:17 AM IST

MP Avinash
MP Avinash

MP AVINASH WILL ATTEND TO CBI ENQUIRY: వైఎస్​ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వైపు చూపిస్తున్న వేళ.. సీబీఐ ఆయన్ను. మరోసారి ప్రశ్నించనుంది. సునీల్‌ యాదవ్‌ బెయిలు పిటిషన్‌పై వేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో అవినాష్‌రెడ్డి పాత్రపై కీలకమైన వ్యాఖ్యలు చేసిన సీబీఐ.. మరింత లోతుగా ఆయన్ని విచారించే అవకాశం ఉంది.

MP AVINASH WILL ATTEND TO CBI ENQUIRY: మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిపై తీవ్రమైన అభియోగాలు వస్తున్న తరుణంలో.. ఆయన్ని నేడు సీబీఐ మరోసారి విచారించనుంది. విచారణ కోసం అవినాష్‌ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. గత నెల 28న సీబీఐ అధికారులు.. తొలిసారి హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో అవినాష్‌ రెడ్డిని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు.

ఇవాళ మరోసారి ప్రశ్నించనున్నారు. నెల రోజుల వ్యవధిలో జరిగిన కీలక పరిణామాలు, సీబీఐకి వచ్చిన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి, వివేకా హత్య కేసులో దాగి ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీయడానికి సీబీఐ అధికారులు అవినాష్‌ రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. గత నెల 28న ప్రశ్నించిన సమయంలో ఆయన ఫోన్‌ నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పనిచేసే నవీన్‌, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలకు ఫోన్లు చేసినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. ఆయన ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా ఈ నెల 3వ తేదీన నవీన్‌, కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు కడపలో విచారించారు.

2019 మార్చి 15న వివేకానందరెడ్డిని హత్య చేసిన స్థలంలో.. సాక్ష్యాధారాలు లేకుండా చెరిపి వేయడం, గుండెపోటుతో చనిపోయాడని అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రచారం చేశారని.. ఇప్పటికే సీబీఐ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. తాజాగా సునీల్‌ యాదవ్‌ బెయిలు పిటిషన్‌కు కౌంటర్‌ వేసిన సీబీఐ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివేకాను హత్య చేయడానికి కొన్నిగంటల ముందు.. కేసులో నిందితుడుగా ఉన్న సునీల్‌యాదవ్‌.. అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని సీబీఐ తెలిపింది.

దస్తగిరి గొడ్డలి కొనుగోలు చేయడానికి కదిరి వెళ్లి తిరిగి వచ్చే వరకు.. అవినాష్‌రెడ్డి ఇంట్లోనే వేచి ఉన్నారని తెలంగాణ హైకోర్టుకు తెలిపిన కౌంటర్‌ అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. వివేకా హత్య జరిగిన విషయం అందరికి మార్చి 15వ తేదీ ఉదయం అతని పీఏ కృష్ణారెడ్డి ద్వారా తెలిస్తే.. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డికి మాత్రం అంతకు కొన్ని గంటల ముందే తెలుసని సీబీఐ పేర్కొంది. ఈ పరిణామాలన్నిటిపైనా అవినాష్‌రెడ్డిని మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.

వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.