Rains in ap సీమలో చల్లబడిన వాతవరణం.. ఈదురుగాలులతో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

author img

By

Published : May 21, 2023, 8:32 PM IST

Rains
వర్షాలు ()

Rains Across the AP State: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించినట్లయింది. మరికొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం వలన.. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వడగళ్లతో కూడిన వర్షం కారణంగా.. అరటి, టమాటా, బొప్పాయి పంటకు నష్టం వాటిల్లింది.

Rains Across the State: గత పది రోజుల నుంచి తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. కడపలో.. ఇవాళ మధ్యాహ్నం భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిపాటి వర్షానికే కడప నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేద్కర్ కూడలి, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం, వై జంక్షన్ కూడలి తదితర ప్రాంతాల్లోని రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది.

భారీగా ఈదురు గాలులు వేయడంతో పలుచోట్ల హోర్డింగులు, చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రోడ్లపై చెట్లు విరిగి పడటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొద్దిపాటి వర్షానికి రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చిరు వ్యాపారులు అవస్థలు పడ్డారు. విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగి.. మరమ్మతులు చేపడుతున్నారు.

సత్యసాయి జల్లాలో వర్షం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వాసులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించింది. హిందూపురం పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో.. విలవిలలాడిన హిందూపురం వాసులకు.. వర్షం రాకతో ఉపశమనం లభించినట్లు అయింది.

గాలివాన బీభత్సం: అన్నమయ్య జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాయచోటి, రాజంపేట, గాలివీడు మండలాల్లో భారీ వర్షం పడింది. రామాపురం, కురబలకోట మండలాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలివీడులో వడగళ్ల వాన కురిసింది. అరటి, బొప్పాయి, టమాటా పంటకు నష్టం వాటిల్లింది.

ఉరుములు, మెరుపులు : అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలడంతో.. గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో.. గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గాలి బీభత్సానికి.. బసినేపల్లి గ్రామంలో బొలెరో వాహనంపై చెట్టు పడంది. దీంతో బొలెరో వాహనం దెబ్బతింది. విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. గుత్తి మండలం పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.