ETV Bharat / state

"ఆ ఇద్దరు డీఎస్పీలకు వైకాపా చెప్పిందే ఐపీసీ"

author img

By

Published : Oct 31, 2022, 12:14 PM IST

YSR DISTRICT DSP
YSR DISTRICT DSP

YSR DISTRICT DSP : ఎంతో కష్టమైన గ్రూప్​ 1 వంటి పరీక్షల్లో నెగ్గి.. ఉద్యోగం సాధించిన అధికారులు ఎవరైనా నిబద్ధతతో పని చేస్తారు. న్యాయం, ధర్మం లక్ష్యంగా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తారు. కానీ ఇక్కడ ఇద్దరు అధికారుల తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఎంతో ఉన్నతమైన పదవుల్లో బాధ్యతలు చేపట్టిన వీరు కేవలం అధికార పార్టీ నాయకుల మన్ననలు పొందడానికే అన్నట్లు విధులు నిర్వహిస్తారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ వాళ్లు ఎవరంటే??

DSP : లక్షల మంది పోటీపడే గ్రూపు-1 వంటి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచి ఉద్యోగం సాధించిన యువ అధికారులు సాధారణంగా.. అంకితభావం, చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేయాలనుకుంటారు. తమను తాము నిరూపించుకుని, ప్రజల మన్ననలు పొందాలనే తపనతో ఉంటారు. వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన 2018 బ్యాచ్‌ గ్రూప్‌-1 అధికారులు ధనిరెడ్డి బాలచంద్రారెడ్డి, వై.మాధవరెడ్డిల తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. డా.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో డీఎస్పీలుగా అత్యంత కీలకమైన, సున్నితమైన సబ్‌డివిజన్ల బాధ్యతలు నిర్వహిస్తున్న వీరిద్దరూ వైకాపా నాయకుల మన్ననలు, మెప్పు పొందటమే లక్ష్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వ్యవహారశైలిపై ప్రత్యేక కథనం.

అమరావతి నుంచి అరసవల్లి వరకూ మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై డా.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి అడుగడుగునా జులుం ప్రదర్శించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. గుర్తింపు కార్డులు ఉంటేనే పాదయాత్రకు అనుమతిస్తామంటూ రైతులను అడ్డగించారు. చూపించిన గుర్తింపు కార్డులను సైతం బాలచంద్రారెడ్డి చించేశారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. పోలీసుల దమనకాండకు నిరసనగా పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన రైతులను.. రామచంద్రపురంలో ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదంటూ డీఎస్పీ హెచ్చరించి పంపించేశారు. మహాపాదయాత్ర విషయంలోనే కాదు ప్రతి అంశంలోనూ అధికార వైకాపా నాయకులకు కొమ్ముకాస్తూ, బాధితుల గోడు పట్టించుకోవడం లేదని ఆయనపై తీవ్ర విమర్శలున్నాయి. అదే జిల్లాలో పని చేస్తున్న మరో డీఎస్పీ మాధవరెడ్డీ తరచూ వివాదాస్పద చర్యలతో విమర్శలపాలవుతున్నారు.

డీఎస్పీ బాలచంద్రారెడ్డి.. ఒకవైపే చూస్తారు

dsp bala chandrareddy
డీఎస్పీ బాలచంద్రారెడ్డి

* వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన బాలచంద్రారెడ్డి.. 2020 నవంబరు 17న రామచంద్రపురం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తొలినాళ్లలో కొంత బాగానే పనిచేశారనే పేరున్నా ఆ తర్వాత నుంచి అధికార వైకాపా నాయకుల మాటే వేదం అన్నట్లు ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

* మండపేటకు చెందిన ప్రగడ కాళీకృష్ణ భగవాన్‌ (20) ఈ ఏడాది మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. మండపేట పట్టణ సీఐ కె.దుర్గాప్రసాద్‌ తీవ్రంగా కొట్టడంతో మర్మాంగాల వద్ద గాయాలై కాళీకృష్ణ చనిపోయాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంలో పోస్టుమార్టం నివేదిక రాకుండానే మృతుని శరీరంపైన గాయాలేవీ లేవంటూ డీఎస్పీ బాలచంద్రారెడ్డి ప్రకటించారని, సీఐని కాపాడేందుకే ఇలా చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేయకుండానే కాళీకృష్ణను అదుపులోకి తీసుకుని రోజంతా స్టేషన్‌లో నిర్బంధించటంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

* మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపైనా బాలచంద్రారెడ్డి అడుగడుగునా జులుం ప్రదర్శించారు.

* పాదయాత్రకు తాత్కాలిక విరామం నేపథ్యంలో రైతులు వెంకటేశ్వర స్వామి దివ్యరథాన్ని రామచంద్రపురంలోని ఓ ప్రైవేటు స్థలంలో ఉంచారు. సాధారణ దుస్తుల్లో అక్కడికి వచ్చిన బాలచంద్రారెడ్డి.. తమను కొట్టారని రథానికి కాపలాగా ఉన్న మావూరి దుర్గాప్రసాద్‌, కోలా చైతన్య, ఒబ్బాని రామకోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రథంలో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన రెండు హార్డ్‌డిస్క్‌లను కూడా బాలచంద్రారెడ్డి తీసుకెళ్లిపోయారు. దీనిపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. ‘వాళ్లు వెధవల్లా మీదకొస్తుంటే ఊరుకుంటామా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. రథం కాపలాదారులను డీఎస్పీ కొట్టినట్లు ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. పాదయాత్రపై పోలీసుల దమనకాండ సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమైందని, దాన్ని ధ్వంసం చేసేందుకే హార్డ్‌డిస్క్‌లను డీఎస్పీ తీసుకెళ్లిపోయారని అమరావతి ఐకాస నాయకులు ఆరోపిస్తున్నారు.

* రామచంద్రపురం పట్టణంలోకి పగటిపూట టిప్పర్లు, లారీలు, భారీ వాహనాలకు అనుమతి లేదు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆయన అనుచరుల ఒత్తిళ్లతో ఆ వాహనాలకు పగటిపూట పట్టణంలోని ఇరుకైన రోడ్డు గుండా వెళ్లేందుకు పోలీసులు వెసులుబాటు కల్పించారు. వందల సంఖ్యలో భారీ వాహనాలు వెళుతుండటంతో పట్టణంలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీనిపై ప్రశ్నించిన విలేకరులను పోలీసులు వేధించడమే కాదు ఒక టీవీ ఛానల్‌ విలేకరిపై కేసు కూడా పెట్టారు.

డీఎస్పీ మాధవరెడ్డి.. అధికార పార్టీకి అండాదండా!

dsp madhavareddy
డీఎస్పీ మాధవరెడ్డి

* వై.మాధవరెడ్డి 2020 నవంబరు 23న అమలాపురం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. మొదట్లో బాగానే పనిచేసినా తర్వాత అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వారు చెప్పిందే చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

* కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువకులపై డీఎస్పీలు మాధవరెడ్డి, షేక్‌ మాసుమ్‌ బాషాల ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇది హింసాత్మక ఘటనలకు దారితీసింది. మాధవరెడ్డి ఏ మాత్రం సంయమనంతో వ్యవహరించి ఉన్నా.. పరిస్థితి అల్లర్ల వరకూ వెళ్లేది కాదన్న వాదనలు ఉన్నాయి. ఈ అల్లర్ల సమయంలో కోనసీమ ఎస్పీగా ఉన్న సుబ్బారెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేశారు. మాధవరెడ్డిని మాత్రం అదే స్థానంలో కొనసాగిస్తున్నారు. తాము చెప్పిందల్లా చేస్తారనే మాధవరెడ్డిని అక్కడి నుంచి బదిలీ కాకుండా వైకాపా నాయకులు చూసుకున్నారన్న విమర్శలున్నాయి.

* అమలాపురం అల్లర్లకు సంబంధించి 250 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా నాయకులు, వారి అనుచరులు చెప్పిన వారినే కేసుల్లో ఇరికించారన్న విమర్శలున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా కేసులు నమోదు చేసి వేధించారన్న విమర్శలున్నాయి.

* అమలాపురం అల్లర్ల ఘటన తర్వాత మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి ఓ ఎంపీటీసీ సభ్యుణ్ని చంపేస్తానని బెదిరించారంటూ ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. కొంకాపల్లికి చెందిన రౌడీషీటర్‌, వైకాపా కార్యకర్త గుమ్మళ్ల సురేష్‌ ‘పోలీసులూ తప్పుకోండి.. నిరసనకారుల ఇళ్లను తగలబెట్టి చంపేస్తా’’ అని బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. ఈ రెండూ పోలీసుల దృష్టికెళ్లినా ఎలాంటి కేసుల్లేవు.

* అమలాపురంలో కొంతమంది రౌడీషీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నా.. అధికార పార్టీ ముఖ్య నాయకుడి ఒత్తిడితో మాధవరెడ్డి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

* చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రొడ్డా భవాని ఈ ఏడాది జులై 7న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, మంత్రి పినిపే విశ్వరూప్‌ అనుచరుడైన దంగేటి రాంబాబు పేరును అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి డీఎస్పీ మాధవరెడ్డి తప్పించారని దళిత సంఘాలు, బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పైగా విచారణ పేరిట బాధితురాలి కుటుంబసభ్యులను మాధవరెడ్డి వేధించారని విమర్శలు మూటగట్టుకున్నారు. ఆయన్ను కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పించి వేరొకరికి అప్పగించాలని ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌కు బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్‌ ఎదుట 58 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు.

* ముమ్మిడివరం నియోజకవర్గ వైకాపా ఎన్నికల పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు కుమారుడు ధనుష్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారంటూ అమలాపురం పట్టణానికి చెందిన ఓ యువతి కొన్నాళ్ల కిందట మాధవరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ధనుష్‌ తండ్రి మంత్రి విశ్వరూప్‌ ప్రధాన అనుచరుడు, మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు బంధువు కావటం వల్లే కేసు నమోదు చేయలేదని.. ధనుష్‌ లండన్‌ వెళ్లిపోయేందుకు కూడా మాధవరెడ్డి సహకరించారనే విమర్శలున్నాయి.

* ఈ ఏడాది సెప్టెంబర్‌ 2న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా తాటిపాక ప్రధాన రహదారిపై ఆ పార్టీ నాయకులు, అభిమానులు కేకు కోస్తుంటే మాధవరెడ్డి వారిని లాఠీతో కొట్టి తరిమేయడం, కేకు కింద పడేయడం వివాదాస్పదమైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.