ETV Bharat / state

Karthikamasam: కార్తీకమాసం తొలి సోమవారం.. భక్తులతో సందడిగా శైవక్షేత్రాలు

author img

By

Published : Oct 31, 2022, 11:41 AM IST

Karthikamasam: రాష్ట్రవ్యాప్తంగా భక్తులు కార్తీకమాస పూజలు ఘనంగా జరుపుకొంటున్నారు. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో గోదావరి తీరం భక్తులతో నిండిపోయాయి. శ్రీశైలం సహా అన్ని ప్రముఖ శివాలయాలూ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ తీరాల్లో స్నానాలు ఆచరిస్తూ.. పూజలు చేస్తున్నారు.

Karthikamasam
కార్తీకమాస పూజలు

కార్తీకమాస పూజలు

Karthikamasam: శ్రీశైల మహాక్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా మారింది. కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచే ఆలయ మాడ వీధులు, గంగాధర మండపం వద్ద మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపారాధనలు చేశారు. కార్తీక దీపాలను వెలిగించిన తర్వాత భక్తులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులకు దేవస్థానం సిబ్బంది అల్పాహారం, బిస్కెట్లు, వేడిపాలు పంపిణీ చేశారు. ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీతో శ్రీగిరిపుర వీధులు కళకళలాడాయి. సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం జరగనుంది.

గుంటూరు జిల్లా: పంచారామ క్షేత్రమైన అమరేశ్వర ఆలయానికి కార్తీక మాసం తొలి సోమవారం వేళ భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించిన మహిళలు.. ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారు. బాల చాముండీకా సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులు రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రకాశం జిల్లా: గిద్దలూరులోని శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు శివుడికి అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యర్రగొండపాలెంలోని శివాలయం భక్తులతో కిటికిటలాడింది. తెల్లవారుజాము నుంచే శివుని దర్శనం కోసం భక్తులు బాలురు తీరారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు. ప్రత్యేక పూజాలు చేశారు. ఆలయం శివనామస్మరణతో మార్మోగిపోయింది. అనంతరం స్వామివారిని దర్శించుకోని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

తూర్పుగోదావరి జిల్లా: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా గోదావరితీరం భక్త జనసంద్రంగా మారింది. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో విశేష సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కర్ ఘాట్​కు భక్తులు పోటెత్తారు. కుటుంబసభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో స్నానమాచరించారు. దీపాలు వెలిగించి నదీమ తల్లికి సమర్పించారు. అనంతరం కార్తీక దీపారాధన, పరమేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కార్తీకమాసంలో దర్శించుకుంటే సర్వ పాపాలు హరించి ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. స్వామివారికి పాలు పళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధన చేసి కోనేటిలో వదిలారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు.

పశ్చిమ గోదావరి జిల్లా: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తణుకులోని శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. భక్తులు స్వామివారికి పాలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధన చేశారు.

కాకినాడ జిల్లా: కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో గోదావరి తీరం.. భక్తుల పూజలు, దీపాలతో దేదీప్యమానమైంది. యానాంలో గౌతమి గోదావరి తీరాన ఉన్న మహా శివలింగం వద్ద భక్తులు జల్లు స్నానాలు ఆచరించారు. పూజలు చేశారు. అనంతరం అరటి గొప్పలు, కొబ్బరి చిప్పులు, తమలపాకులో వెలిగించిన దీపాలను గోదావరిలో వదిలి నమస్కరించుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి ఆదేశాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది స్నాన ఘట్టాలు వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టారు, ప్రత్యేక ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ జిల్లా: కార్తీకమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకొని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రముఖ శివాలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి పూజలు చేశారు. జగ్గయ్యపేటలోని పెద్ద శివాలయం, మఠం శివాలయం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం, ముత్యాల శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. పెనుగంచిప్రోలు, అనుమంచిపల్లి, తక్కెళ్లపాడు గ్రామాల్లోని పురాతన శివాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం చేసుకుని దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆయా శివాలయాల్లో స్వామివారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా: జిల్లావ్యాప్తంగా వేకువజాము నుంచే శివాలయాలలో భక్తజనం పూజలు చేశారు. జిల్లా కేంద్రం అమలాపురం మొదలుకొని పలు ప్రాంతాలలో కొలువైన శివాలయాలలో పరమశివుడిని కొలుస్తూ భక్తులు అభిషేకాలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. స్మామివారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. మురములలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా స్వామివారి అమ్మవార్లకు వేద పండితులు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచ ద్రవ్యాలతో అభిషేకలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ఆలయ ఈవో ధర్మకర్త మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. పంచారామ క్షేత్రం దాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడు సన్నిధికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. సప్త గోదావరి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. భీమేశ్వరుడికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. 12వ శక్తిపీఠం మాణిక్యాంబ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ దంపతులు భీమేశ్వరుడిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.

బాపట్ల జిల్లా: చీరాల,పేరాల, వేటపాలెం, చిన్నగంజాం ప్రాంతాల్లోని శివాలయాలన్నీ భక్తులతొ కిటకిటలాడుతున్నాయి.పేరాలలోని పురాతనమ్తెన పునుగురామలింగేశ్వర స్వామి దేవాలయం, చీరాలలోని అతిపురాతన గంగాసమేత బ్రమరాంబికామల్లీశ్వరస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులుదీరారు. భక్తులు.. శివయ్యకు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వంచారు. శివాలయ ప్రాంగణంలో మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు. మల్లన్న దేవాలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి.

వైఎస్సార్​ కడప జిల్లా: కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో కడప నగరంలోని శివాలయాలు అన్ని శివనామస్మరణంతో మార్మోగిపోతున్నాయి. కడపలో ప్రసిద్ధిగాంచిన మృత్యుంజయకుంట శివాలయం, నబీకోట శివాలయం, మోసంపేట శివాలయం, దేవుని కడప శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి ప్రార్థనలు మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో మహిళలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ఆవరణలో కార్తీకదీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వచ్చే సోమవారం పౌర్ణమి కావడంతో భారీగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.