ETV Bharat / state

పట్టపగలే బ్యాంకులో దోపిడీ, సిబ్బందిని కత్తితో బెదిరించి నగదుతో ఉడాయించిన దుండగుడు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 10:41 AM IST

Bank_Robbery_in_West_Godavari_District
Bank_Robbery_in_West_Godavari_District

Bank Robbery in West Godavari District: పశ్చిమగోదావరి జిల్లాలో పట్టపగలే బ్యాంకులో దోపిడీ జరిగిన ఘటన కలకలం రేపింది. సిబ్బందిని కత్తితో బెదిరించిన దుండగుడు నగదుతో ఉడాయించాడు. మరోవైపు.. అనంతపురం జిల్లాలో ఓ ఇంట్లో ప్రవేశించిన ఆగంతకుడు.. బీరువాలో ఉన్న బంగారం, నగదును చోరీ చేశాడు. పట్టపగలే ఇలా చోరీలు జరగటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Bank Robbery in West Godavari District: పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో పట్టపగలే బ్యాంకులో దోపిడీ జరిగింది. సిబ్బందిని కత్తితో బెదిరించిన దుండగుడు.. రూ.6.5 లక్షలతో ఉడాయించాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బ్యాంక్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురంలోని రెడ్డప్పవారివీధిలోని స్టేట్‌ బ్యాంకు బజారు శాఖ సమీపంలో పెద్దగా జనసంచారం ఉండదు. దీనికితోడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పట్టణంలో వర్షం కురిసింది. బ్యాంకు మేనేజరు పి.ప్రేమ్‌కుమార్‌ ఇంటికి భోజనానికి వెళ్లారు. ఆ సమయంలో ప్రధాన క్యాషియర్‌ కనకదుర్గ, క్యాషియర్‌ శిరీష, మెసెంజర్‌ పిట్టా డేజిఫ్లారెన్స్‌ ఉన్నారు. కనకదుర్గ తన ఛాంబర్‌లో మెసెంజర్‌తో కలిసి నగదు లెక్కిస్తున్నారు.

ఆ సమయంలో ముఖం కనిపించకుండా చేతి రుమాలు, తలపై టోపీ ధరించిన వ్యక్తి చేతిలో బ్యాగుతో మెయిన్‌ క్యాషియర్‌ ఛాంబర్‌లోకి ప్రవేశించాడు. తనకు బంగారు ఆభరణాలపై రుణం కావాలని కోరగా.. నాణ్యతా నిర్ధారణ అధికారి వచ్చే వరకు బయట వేచి ఉండాలని క్యాషియర్‌ సూచించారు. ముఖానికి ఉన్న రుమాలు తొలగించాలని డేజిఫ్లారెన్స్‌ సూచించగా తనకు అనారోగ్యంగా ఉందని ఆ వ్యక్తి బదులిచ్చాడు.

పట్టపగలే దోపిడీ.. గన్​తో బెదిరించి బ్యాంకు లూఠీ!

తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ నుంచి బయటకు తీసిన కత్తిని చూపి చంపేస్తానని బెదిరించాడు. టేబుల్‌పై ఉన్న రూ.7.50 లక్షలు విలువగల నోట్ల కట్టలను అపహరించుకుని వెళ్తుండగా.. వాటిలోని రూ.500 నోట్ల కట్టలు రెండు బ్యాంకులోనే జారిపడ్డాయి. మిగిలిన రూ.6.50 లక్షల నగదుతో ఆ ఆగంతుకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. బ్యాంకు ఆవరణలో బందోబస్తు లేదు. బయట సీసీ కెమెరాలు కూడా లేవు. దీంతో ఆగంతుకుడు ఏ వాహనంపై ఎటువైపు వెళ్లాడో తెలియని పరిస్థితి నెలకొంది.

దోపిడీపై సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు డీఎస్పీ రవి మనోహరచారి తెలిపారు. ఎస్సైతో కలిసి ఆయన బ్యాంక్ సిబ్బందిని ఆరా తీశారు.

"సీసీ కెమెరా పుటేజీని పరిశీలించాం. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను నియమిస్తున్నాం. త్వరలో నిందితుడిని పట్టుకొని అపహరణకు గురైన నగదు రాబడతాం" - రవి మనోహరచారి, డీఎస్పీ

ఎస్​బీఐ కస్టమర్​ సెంటర్​లో పట్టపగలే దోపిడీ, తలపై సుత్తితో కొట్టి

అనంతపురం జిల్లాలో పట్టపగలే చోరీ.. ఇంటోకి ప్రవేశించి బంగారం, నగదు దోపిడీ..
Uravakonda Gold and Cash Theft Case: మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని వాసవీ కల్యాణ మండపం వద్ద ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామానికి చెందిన రైతు సాయి స్వగ్రామంలోని పొలానికి వెళ్లిన సమయంలో.. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి వెనుక వైపు ఉన్న తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 80 వేల నగదును అపహరించినట్లు బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పట్టపగలే చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

పట్టపగలే దోపిడీ.. బైక్​ల​పై వెంబడించి, తుపాకులతో బెదిరించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.