ETV Bharat / state

శారదా పీఠానికి రాజమార్గం..! జనావాసాలు లేకున్నా చకచకా పనులు..

author img

By

Published : Jan 12, 2023, 1:35 PM IST

ROAD FOR SARADHA PEETAM : నిత్యం వేల మంది సందర్శించే విశాఖలోని కైలాసగిరిలో అసంపూర్తిగా మిగిలిన పనులు వెక్కిరిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. కొమ్మాది కూడలి నుంచి కొమ్మాది వరకు నిర్మించ తలపెట్టిన పనులూ మధ్యలోనే వదిశారు. మధురవాడ-బక్కన్నపాలెం రోడ్డు నిర్మాణానికి 210 మీటర్లు సేకరించలేక చేతులెత్తేశారు. విశాఖలో ఇన్ని అభివృద్ధి పనులను పక్కనపెట్టి... ఎవరూలేని కొండలు, గుట్టల్లో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టడం ఎవరికోసమని విశాఖవాసులు ప్రశ్నిస్తున్నారు.

ROAD FOR SARADHA PEETAM
ROAD FOR SARADHA PEETAM

ROAD FOR SARADHA PEETAM : విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం కొత్తవలస గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 102, 103ల్లోని జనావాసం లేని కొండపైకి వీఎంఆర్‌డీఏ ఏకంగా రోడ్డు నిర్మాణం చేపట్టింది. కొండపై జనావాసం లేదు. లేఅవుట్లూ వేయలేదు. ఎటువంటి నిర్మాణాలూ కనిపించవు. ప్రస్తుతానికి అక్కడ ఏ రకమైన ప్రజోపయోగం లేకపోయినా రూ.1.75 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తోంది.

విశాఖ శారదా పీఠానికి ప్రభుత్వం కేటాయించిన స్థలానికి వెళ్లే మార్గం గుండానే ఈ రోడ్డును ప్రతిపాదించారు. పీఠం అవసరాల కోసమే రోడ్డు నిర్మిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలోని చినముషిడివాడలో ఉన్న శారదా పీఠానికి భీమిలి మండలం కొత్తవలసలో ఏడాది కిందట విలువైన ప్రభుత్వ భూములను కేటాయించారు. ఈ కొండపై సర్వే నంబరు 102/2లో 7.70 ఎకరాలు, 103లో 7.30 ఎకరాలను సంస్కృత వేద పాఠశాలకు కేటాయించారు.

విశాఖ నగర పరిధిలో కనుచూపు మేరలో సముద్రపు అందాలు కనిపిస్తూ, ఆహ్లాదకర వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఎకరా దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రభుత్వ మార్కెట్‌ విలువకు ఇచ్చేలా తొలుత నిర్ణయం తీసుకున్నా ఎకరా రూ.లక్ష చొప్పున రూ.15 లక్షలకు కారుచౌకగా పీఠానికి అప్పగించారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ స్థలం మీదుగా రోడ్డు నిర్మాణానికీ పూనుకుంది. నేరుగా శారదా పీఠానికి రోడ్డు వేస్తే విమర్శలు వస్తాయని అధికారులు భావించినట్లున్నారు. అదే కొండపై వీఎంఆర్‌డీఏకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఈ భూముల వైపు రోడ్డు నిర్మాణ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారు.

అక్టోబరులో వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో రూ.1.75 కోట్లతో రోడ్డు పనులకు పరిపాలన అనుమతులు పొందారు. పీఠానికి కేటాయించిన భూములకు విలువ పెరిగేలా వీఎంఆర్‌డీఏ 2041 బృహత్తర ప్రణాళికలోనూ రోడ్లను ప్రతిపాదించారని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించనున్న ఆరు వరుసల రోడ్డు కూడా వీటికి సమీపంగానే ఉంటుందని చెబుతున్నారు. రోడ్డు నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ గత నెలలో టెండర్లు పిలిచింది. కొండ కింద నుంచి పైకి 1.20 కిలోమీటర్ల పొడవున, 40 అడుగుల వెడల్పుతో ఘాట్‌ రోడ్డును నిర్మిస్తోంది.

శారదా పీఠం సంస్కృత పాఠశాలకు కేటాయించిన స్థలం మీదుగా రోడ్డు వెళ్లేలా అలైన్‌మెంట్‌ చేశారు. ఇప్పటికే మార్కింగ్‌ పూర్తయింది. గుత్తేదారు కొండ తవ్వకం పనులు మొదలుపెట్టారు. వాహనాల రాకపోకలకు వీలుగా దారులు పరిచారు. కొండ తవ్వగా వచ్చిన గ్రావెల్‌ను అనధికారికంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.