అయ్యన్న కుమారుడికి నోటీసు ఇచ్చాం: ఆర్డీవో

author img

By

Published : Jun 19, 2022, 10:02 PM IST

ఆక్రమణపై అయ్యన్న కుమారుడికి నోటీసు ఇచ్చాం

నీటిపారుదల శాఖ స్థలం ఆక్రమణపై అయ్యన్న కుమారుడికి నోటీసు ఇచ్చామని నర్సీపట్నం ఆర్డీవో తెలిపారు. ప్రభుత్వ సర్వేయర్లతో జాయింట్ సర్వే చేయాలని అయ్యన్న కుమారులు కోరారని చెప్పారు.

ఆక్రమణపై అయ్యన్న కుమారుడికి నోటీసు ఇచ్చాం

నర్సీపట్నంలో తెదేపా నేత అయ్యన్న ఇంటిగోడ కూల్చివేతపై ఆర్డీవో గోవిందరాజు స్పందించారు. నీటిపారుదలశాఖ కాలువ స్థలం ఆక్రమించారని ఫిర్యాదు వచ్చిందని.., ఈ క్రమంలో ఆక్రమణపై అయ్యన్న కుమారుడికి నోటీసు ఇచ్చామని తెలిపారు. కాగా.. ప్రభుత్వ సర్వేయర్లతో జాయింట్ సర్వే చేయాలని అయ్యన్న కుమారులు కోరారని చెప్పారు. జాయింట్ సర్వే విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో తెలిపారు. ఒకవేళ తాము ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించామని తేలితే.. తామే తొలగిస్తామని అయ్యన్న కుటుంబ సభ్యులు చెప్పారని ఆర్డీవో వెల్లడించారు. నీటిపారుదలశాఖ ఇచ్చిందన్న ఎన్‌వోసీ.. 276 సర్వే నెంబర్‌కు కాదని ఆర్డీవో తెలిపారు.

ఇదీ జరిగింది: అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. శనివారం అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల అర్ధరాత్రి నుంచే.. విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్నపాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. అలాగే.. అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లే రెండు మార్గాలనూ పోలీసులు మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసుల బలగాలు మోహరించారు.

అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని.. ఇంటి గోడ ధ్వంసం చేయడంపై ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేష్‌ను పోలీసులు చుట్టుముట్టారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులతో.. అయ్యన్న కుటుంబం వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే..: అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత ముమ్మాటికీ కక్ష సాధింపేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా సీఎం జగన్ అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని చంద్రబాబు మండిపడ్డారు. అయ్యన్న ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ జగన్ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరని ఆక్షేపించారు. అందువల్లే కూల్చివేతలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.