ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల దాడులు.. గంజాయి, అక్రమ మద్యం, గుట్కా పట్టివేత

author img

By

Published : Jun 19, 2021, 9:39 PM IST

illigal liquor cought
illigal liquor cought

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి, అక్రమ మద్యం, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. వాహనాలను సీజ్ చేశారు.

విశాఖ జిల్లా గోపాలపట్నంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జి.మాడుగుల ప్రాంతానికి చెందిన పి. వెంకటేశ్ అనే వ్యక్తి ఆటోలో లక్ష్మీనగర్​కు 26 కిలోల గంజాయిని తరలిస్తున్నాడన్న సమాచారంతో టాస్క్​ఫోర్స్, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరకును, ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కె.కోటపాడు మండలం గుల్లిపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో కె.కోటపాడు ఎస్సై నారాయణరావు, సిబ్బంది కలిసి పాన్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఓ దుకాణంలో 19 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గొలుసు దుకాణం నిర్వహిస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వచేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

భీమునిపట్నం మండలం పరిధి తాళ్లవలసలో సుమారు 8 లక్షల విలువైన గుట్కా బస్తాలను భీమిలి పోలీసులు పట్టుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు.

చిత్తూరు జిల్లాలో..

తిరుపతిలో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్​స్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితుల నుంచి కిలో గంజాయితో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లా పెనుగొండ పోలీసులు లక్ష రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 18 మందిని అరెస్ట్ చేసి.. 12ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అక్రమ మద్యం రవాణాను కట్టడి చేస్తోన్న పోలీసులను డీఎస్పీ మహబూబ్ బాషా ప్రశంసించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

ఇచ్చాపురం టోల్ ప్లాజా సమీపంలో చేపల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీధి కూడలి వద్ద 37 బస్తాల గుట్కా పట్టుకున్నట్లు ఎస్​ఈబీ ఎస్సై కె. కళ్యాణి తెలిపారు.

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలో తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 581 మద్యం బాటిళ్ల విలువ రూ.90 వేలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఓ ట్రాలీ ఆటోను సీజ్ చేశారు.

ఇదీ చదవండి: ధాన్యం బకాయిలు చెల్లించాలని తెదేపా నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.