ETV Bharat / state

ఉపకులపతుల నియామకాల్లో జాప్యం..

author img

By

Published : Nov 28, 2022, 9:11 AM IST

Updated : Nov 28, 2022, 10:35 AM IST

Delay In Appointment Of Vice-Chancellors In AP: విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలాన్ని పొడిగించేందుకు.. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి కొత్త నాటకానికి తెర తీశాయి. అనుకూలంగా ఉన్న వారికి లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశపూర్వకంగా కొత్త ప్రకటనను అడ్డుకుంటున్నాయి. వీసీల పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు.. కొత్త వీసీల కోసం ప్రకటన ఇవ్వాల్సి ఉండగా.. కావాలనే జాప్యం చేశాయి. ఇప్పుడు సమయం లేదంటూ ఉపకులపతుల పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Appointment Of Vice-Chancellors
విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం

Delay In Appointment Of Vice-Chancellors In AP: పద్మావతి మహిళా వర్సిటీ, యోగివేమన, కృష్ణా, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాల వీసీల పదవీకాలం జనవరి 7తో ముగియనుంది. ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు అనుమతివ్వాలని.. అక్టోబర్ మొదటి వారంలో ఉన్నత విద్యాశాఖకు ఉన్నత విద్యామండలి దస్త్రాన్ని పంపింది. దీన్ని వెంటనే పరిష్కరించాల్సిన ఉన్నత విద్యాశాఖ.. నవంబర్ మొదటి వారం వరకు అట్టిపెట్టుకుంది. ఆ తర్వాత కొత్త వీసీల ప్రకటనకు ఆమోదం తెలుపుతూ ఉన్నత విద్యామండలికి దస్త్రాన్ని పంపగా.. 20 రోజులుగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాశాఖ నుంచి దస్త్రం వచ్చిన వెంటనే ప్రకటన విడుదల చేయాలి. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనకు నెలన్నర పడుతుంది. సెర్చ్‌ కమిటీలో యూజీసీ తరఫున నామినీ నియామకానికి నెల రోజుల సమయం కావాలి. ఉన్నత విద్యాశాఖ నెల రోజులపాటు దస్త్రాన్ని ఆపేయగా.. ఉన్నత విద్యామండలి 20 రోజులుగా ప్రకటన ఇవ్వకుండా పక్కన పెట్టింది. దీనివల్ల డిసెంబర్‌లో ప్రకటన ఇచ్చినా కొత్త వీసీ పోస్టులు భర్తీకి సమయం సరిపోదని.. ప్రస్తుతమున్న వారికే 6 నెలలు పొడిగించాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదిస్తోంది. యోగివేమన, పద్మావతి మహిళ, కృష్ణా విశ్వవిద్యాలయాల వీసీలు ఉన్నత స్థాయిలోని ఓ వ్యక్తికి కావాల్సినవారని.. అందువల్లే ఈ విధంగా చేశారనే విమర్శలు వస్తున్నాయి. వీరివల్ల ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ పోస్టు భర్తీ కూడా పెండింగ్‌లో ఉంది.

విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాల్లో జాప్యం

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతిని ఈ నెల 18న ఎంపిక చేస్తామని.. ఇటీవల ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ప్రకటించారు. ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ వర్సిటీలో వీసీకి ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. అలాంటప్పుడు వీసీ పోస్టుకు 60 దరఖాస్తులు ఎలా వచ్చాయో ఆయనే చెప్పాలి. ఈ పోస్టు భర్తీకి ఎందుకింత జాప్యం చేస్తున్నారో, ఈ నెల 19న సెర్చ్‌ కమిటీ సమావేశమైనా అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేయలేదో అంతుచిక్కడం లేదు.

గతంలో ఒకసారి దరఖాస్తులు స్వీకరించి, మంచి అభ్యర్థులు రాలేదంటూ రద్దు చేశారు. ఈసారి ఇదే విధానం అమలు చేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆదికవి నన్నయ వర్సిటీలో అక్రమాలు జరిగినట్లు మాజీ ప్రత్యేక అధికారి ఏయస్​వీయస్​​ సాంకృత్యాయన్‌.. గవర్నర్‌తోపాటు ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు చేశారు. వీటిపై విచారణ జరిపేందుకు అనుమతి కోరుతూ ఉన్నత విద్యాశాఖకు ఉన్నత విద్యామండలి దస్త్రాన్ని పంపింది. ఆ దస్త్రాన్ని ఉన్నత విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పక్కన పెట్టడంతో.. మరోసారి అనుమతి కోరేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 28, 2022, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.