అక్క మృతి తట్టుకోలేక చెల్లెలు.. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని తల్లి

author img

By

Published : Mar 12, 2023, 10:33 AM IST

Updated : Mar 12, 2023, 12:53 PM IST

అక్కాచెల్లెళ్ల మృతి

symbol of spirituality and affection: ఆ ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టలేదు. అయినా సరే.. 70ఏళ్లకు పైగా కలిసి బతికారు. అక్కాచెల్లెళ్ల మాదిరిగా అనురాగం పంచుకున్నారు. ఆప్యాయతతో మెలిగారు. ఇరుగుపొరుగుకు ఆదర్శంగా నిలిచారు. వయోభారం, అనారోగ్యంతో అక్క మృతిచెందగా.. ఆమె భౌతిక కాయంపై రోదిస్తూ చెల్లి కూడా కన్నుమూసింది. కడదాకా కలిసే అని చాటేలా.. ఆఖరి ప్రయాణంలోనూ అక్కతోపాటే వెళ్లిపోయింది. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని మల్లంగుంటలో జరిగిన ఈ ఘటన గ్రామస్థులను విషాదంలో ముంచెత్తింది. ఇక.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామంలో కుమార్తె ప్రేమ పెళ్లి.. ఆమె తల్లిని బలి తీసుకుంది. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని కుటుంబానికి తలవంపులు తెచ్చిందని మనస్తాపానికి గురై తల్లి బలవన్మరణానికి పాల్పడింది.

symbol of spirituality and affection: తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని మల్లంగుంటలో జరిగిన ఓ ఘటన.. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా అక్కాచెల్లెళ్ల మాదిరిగా ఆదర్శంగా నిలిచిన ఆ వృద్ధ మహిళలు ఒకరివెంట మరొకరు కన్నుమూశారు. అక్క భౌతికకాయంపై రోదిస్తూ చెల్లి కూడా ఊపిరి వదలడం గ్రామస్థులను కలిచివేసింది.

మల్లంగుంట కంటతడి... తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని మల్లంగుంటలో విషాదం చోటు చేసుకుంది. ఆ ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా సుమారు 70 సంవత్సరాలకు పైగా సొంత అక్కా చెల్లెళ్ల మాదిరిగా కలిసి బతికారు. వివాహానంతరం ఏర్పడిన వారి పరిచయాన్ని కడదాకా కొనసాగించారు. కంబాల మునెమ్మ (87), అంజూరి పాపమ్మ (85) సమీప బంధువులు. సంసార జీవితంలో ఒకరికొకరు ఎంతో ఆసరాగా ఉండేవారు. కష్ట, సుఖాలు పంచుకునేవారు. అక్కా అనగానే.. ఆ చెల్లీ.. అని పిలుచుకుంటూ ప్రేమానుబంధాలతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ నేపథ్యాన మునెమ్మ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలుసుకున్న పాపమ్మ... మునెమ్మ మృతదేహంపై పడి బోరును విలపిస్తూ భావోద్వేగానికి లోనై అక్కడికక్కడే కుప్పకూలింది. గ్రామస్థులు ఎంత పిలిచినా పలకకపోవడంతో సమీపంలోని వైద్యున్ని తీసుకొచ్చి పరీక్షించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండి మరణంలోనూ ఒకటిగా వెళ్లిపోయారంటూ గ్రామస్థులు కన్నీటి పర్వంతమయ్యారు.

ప్రేమ వివాహం చేసుకున్న డిగ్రీ విద్యార్థిని.. కుమార్తె ప్రేమ వివాహం చేస్తుకుందని మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దాసరి అనిత-చిన్న వీరయ్యకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి పంపించేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండో కుమార్తె దివ్యను గుంటూరులోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదివిస్తున్నారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న దివ్య.. గుండవరం గ్రామానికి చెందిన మొక్కే గోపితో ప్రేమలో పడింది. పెద్దలు తమ వివాహానికి ఒప్పుకోరనే ఆందోళలతో ఈనెల 8వ తేదీన పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉన్నదని పోలీసులను ఆశ్రయించారు.

తలవంపులు తెచ్చిందని.. గ్రామానికి చెందిన పలువురు పెద్దలు.. దివ్యకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె వారి మాట వినకపోగా తల్లిదండ్రులను కూడా నమ్మలేదు. దీంతో దివ్య తల్లిదండ్రులు కొండంత విచారంతో ఇంటికి తిరిగి వచ్చేసారు. గ్రామంలో తమ పరువు పోయిందని.. మూడు రోజులుగా ఇంట్లోనే మదనపడుతున్న దివ్య తల్లి అనిత... శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ వినోద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Mar 12, 2023, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.