Rains Overall: రాష్ట్రవ్యాప్తంగా వర్ష బీభత్సం.. కొంత తగ్గిన వేసవి తాపం

author img

By

Published : May 18, 2023, 10:49 PM IST

Updated : May 18, 2023, 10:54 PM IST

Etv Bharat

Rains In AP: వేసవి తాపాన్ని తట్టుకోలేక అల్లాడుతున్న జనాలకు వర్షం కొంత ఊరట ఇచ్చింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. వర్షంతో పాటు ఈదురు గాలుల తాకిడి ప్రభావానికి చెట్లు విరిగి నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల గాలుల తీవ్రతకు విద్యుత్ తీగలు తెగిపోగా.. నెల్లూరులో షార్ట్ సర్క్యూట్​తో ట్రాన్స్​ఫార్మర్​ పేలిపోయింది.

రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం

Rains In AP: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గాలి వాన భీభత్సం సృష్టించింది. కురిసిన వర్షం ధాటికి వృక్షాలు నేలకూలడంతో పాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలుల ప్రభావంతో నివాసాల రేకులు ధ్వంసమయ్యాయి. ఫ్లెక్సీలు తెగి కరెంట్ తీగల మీద పడి ప్రమాదకరంగా మారాయి. ఇక ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభించినట్లయింది.

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని జయరామచంద్రపురంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు సుమారు 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ. 4 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. జరిగిన నష్టాన్ని చూసి ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరుతున్నారు.

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కొండ్రప్రోలులో గాలివానతో వచ్చిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.. అలాగే రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది

ప్రకాశం జిల్లా కనిగిరిలో భారీ ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. గత ఐదు రోజులుగా ఎండ తీవ్రత తాళలేక అల్లాడుతున్న ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభించినట్లయింది. ఉదయం నుండి సూర్య ప్రతాపంతో భగభగలాడిన కనిగిరి ప్రాంతం మధ్యాహ్నం అనంతరం ఒక్కసారిగా ఉరుములు మెరుపులు భారీ ఈదురుగాలులతో కూడిన కురిసింది ఫలితంగా రోడ్లన్నీ జలమయం కాగా పట్టణ శివారు ప్రాంతాలలో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి.

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షంకు చెట్లు కొమ్మల విరిగి విద్యుత్ తీగలపైన రహదారి పైన పడ్డాయి వేసవితాపంతో అల్లాడుతున్న జనాలకు వర్షం ఊరటనిచ్చినా గాలి మాత్రం ఇబ్బంది కలిగించింది. సాయంత్రం 5గంటల నుంచి 5:45 గంటల వరకు కురవడంతో పట్టణ రహదారితో పాటు రైల్వే ట్రాక్ పైన స్టేషన్ వద్ద చెట్లు కొమ్ములు విరిగి విద్యుత్ తీగలపై ఫ్లెక్సీలు ఎగిరిపడ్డాయి. దీని ఫలితంగా పురపాలక విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇవ్వాళ పెను గాలులతో కూడిన వడగళ్ళ వర్షం కురిసింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో వర్షం తోపాటు గాలుల ధాటికి ఎన్టీఆర్ క్రీడా మైదానంలోని పైకప్పు రేకులు ఎగిరి ధ్వంసమయ్యాయి. గంగమ్మ జాతరలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల నిర్మాణాలు నేల కూలాయి. పలు చోట్ల ఇళ్ళ పైకప్పు రేకులు ధ్వంసం కావడంతో నష్టం వాటిల్లింది అని బాధితులు వాపోయారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈదురు గాలుల వాన భీబత్సం సృష్టించింది. గత నెల రోజులుగా భానుడు విశ్వరూపం చూపిస్తూ ఉండడంతో ఉక్క పోతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురకొంటుండగా ఇవాళ ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. ఆత్మకూరు పట్టణంతో పాటు పలుచోట్ల ఈదురు గాలులతో వాన పడింది. గాలుల తీవ్రతకు పట్టణంలో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. మరో వైపు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వాసుపత్రి వద్ద గాలుల తాకిడికి షార్ట్ సర్క్యూట్​తో ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయింది. దీంతో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీస్ స్టేషన్​. దర్గా సెంటర్ వద్ద భారీ వృక్షాలు విరిగి రోడ్లపై పడ్డాయి.

ఇవీ చదవండి:

Last Updated :May 18, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.