లోకేశ్‌ పలాస పర్యటనలో హైడ్రామా, నేతల అరెస్టు

author img

By

Published : Aug 21, 2022, 10:46 AM IST

Updated : Aug 22, 2022, 6:45 AM IST

LOKESH TOUR

LOKESH TOUR తెలుగుదేశం నేత నారా లోకేశ్‌ పలాస పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక నేత పరామర్శకు వెళ్తున్నలోకేశ్‌ను శ్రీకాకుళంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి. తర్వాత లోకేశ్‌ను విడిచిపెట్టినప్పటికీ ఆయన మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ లోకేశ్‌ విశాఖ విమానాశ్రయంలో బైఠాయించారు. పలాసలో విధ్వంసకాండకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Lokesh Tour: తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులు, నిర్బంధాలతో శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలాసలో తెదేపా, వైకాపా తలపెట్టిన నిరసనల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే ఉత్కంఠ మొదలైంది. పోలీసులు భారీస్థాయిలో మోహరించారు. రోడ్లపైకి వచ్చిన నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. జిల్లా పర్యటనకు వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విశాఖపట్నానికి తరలించారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై తెదేపా నేత గౌతు శిరీష అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమె క్షమాపణ చెప్పాలంటూ పలాస తెదేపా కార్యాలయాన్ని ముట్టడించాలని వైకాపా నాయకులు పిలుపునిచ్చారు. మరోవైపు ఆత్మగౌరవ సభ పేరుతో తెదేపా సైతం ఆందోళనకు సిద్ధమైంది. రెండురోజుల క్రితం ఆక్రమణలున్నాయంటూ పలాస తెదేపా కౌన్సిలర్‌ సూర్యనారాయణ ఇంటిని కూల్చేందుకు అధికారులు యత్నించారు. దీనిపై తెదేపా శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ నేపథ్యంలో లోకేశ్‌ పలాస వచ్చి ఆయన్ను పరామర్శించాలని భావించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు పలాసలో ఎలాంటి కార్యక్రమాలకూ అనుమతి ఇవ్వలేదు.

లారీ అడ్డుపెట్టి.. కాన్వాయ్‌ నిలిపి..

శ్రీకాకుళం సమీపంలోని కొత్తరోడ్డు కూడలి వద్ద లోకేశ్‌ పలాస వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఓ కంటెయినర్‌ లారీని రహదారికి అడ్డంగా పెట్టించారు. లోకేశ్‌ అక్కడికి చేరుకోగానే జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ ఆయనకు నోటీసు ఇచ్చి, పలాస వెళ్లేందుకు వీలులేదన్నారు. తమ పార్టీ కార్యకర్తను పరామర్శించే హక్కు లేదా అని లోకేశ్‌ పోలీసులను ప్రశ్నించారు. ‘నేను సిటింగ్‌ ఎమ్మెల్సీని, మాజీ మంత్రిని గుర్తుపెట్టుకోండి. నాకు పాఠాలు చెప్పొద్దు. పలాస వెళ్లొద్దని చెప్పేందుకు మీరెవరు?’ అంటూ పోలీసులపై మండిపడ్డారు. వారి వైఖరిని నిరసిస్తూ లోకేశ్‌ సహా పార్టీ నాయకులంతా గంటపాటు రోడ్డుపైనే బైఠాయించారు. పలాస వెళ్లి తీరతానని లోకేశ్‌ చెప్పడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుంటూ.. వాహనంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. వారి తీరుపై లోకేశ్‌ మండిపడ్డారు. చివరికి ఆయన్ను వాహనంలోకి ఎక్కించి, విశాఖ వైపు తీసుకెళ్లి మధురవాడ వద్ద వదిలారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు, నిమ్మకాయల చినరాజప్ప, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కొందరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు లోకేశ్‌తో పాటు ఉన్నారు.

వైకాపా ‘ముట్టడి’ అడ్డగింపు..

పలాసలో వైకాపా శ్రేణులు తలపెట్టిన తెదేపా కార్యాలయ ముట్టడినీ పోలీసులు అడ్డుకున్నారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలికి ఉదయం 9 గంటల నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. 10 గంటలయ్యేసరికి వందలమంది చేరుకున్నారు. వారంతా ర్యాలీగా బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకొని వాహనాల్లో తరలించారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

విశాఖ విమానాశ్రయంలో లోకేశ్‌ బైఠాయింపు

తెదేపా ప్రధానకార్యదర్శి లోకేశ్‌కు విశాఖ పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కుమారుడి నిశ్చితార్థ వేడుక నుంచి విమానాశ్రయానికి తరలించారు. విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్‌ లోనికి వెళ్లకుండా పోలీసుల తీరుకు నిరసనగా అక్కడే బైఠాయించి, నినాదాలు చేశారు. అదుపులోకి తీసుకున్న తనను నిశ్చితార్థానికి ఎందుకు పంపించారని అడిగారు. ఏ కారణంతో అరెస్టు చేశారని నిలదీశారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన డీఎస్పీ లోకేశ్‌కు ముందస్తు అరెస్టు కింద 151 నోటీసు ఇచ్చి, స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడంతో నిరసన విరమించారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు విమానాశ్రయం వెలుపల రోడ్డుమీద బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం లోకేశ్‌ వారివద్దకు వెళ్లి సముదాయించారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 వరకు విమానాశ్రయంలో నిరనస కొనసాగింది.

లోకేశ్‌ పలాస పర్యటనలో హైడ్రామా

కార్యకర్తను పరామర్శించకూడదా?

తిరుగు ప్రయాణమయ్యే ముందు విలేకర్లతో లోకేశ్‌ మాట్లాడుతూ ‘పలాసలో తెదేపా కార్పొరేటర్‌ భవనాన్ని కూల్చారు. వెంటనే వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని మూడు రోజుల తర్వాత బయలుదేరా. టూర్‌ షెడ్యూల్‌నూ విడుదల చేశాం. అలాంటిది పలాసకు వెళ్లే మార్గంలో నన్ను నిర్బంధించారు. డీఎస్పీ నన్ను వాహనంలోకి తోశారు. అక్కడి నుంచి రెండు, మూడు స్టేషన్ల పేర్లు చెప్పి చివరకు విమానాశ్రయానికి అన్నారు. తీరా విశాఖకు వచ్చాక పీఎంపాలెంలోని వీ-కన్వెన్షన్‌ సెంటరుకు తీసుకొచ్చారు. ఇక్కడికి ఎందుకని అడిగితే షెడ్యూల్‌ ప్రకారం నిశ్చితార్థానికి వెళ్లాలి కదా అని చెప్పారు. అక్కడినుంచి మరో పెళ్లి కోసం శ్రీకాకుళం బయలుదేరుతుండగా విశాఖ పోలీసులు వచ్చి ముందస్తు అరెస్టులో ఉన్నానంటూ విమానాశ్రయానికి తీసుకొచ్చేశారు’ అని చెప్పారు.

నేనేమీ టెర్రరిస్టును.. నక్సలైటును కాను

‘మళ్లీ చెబుతున్నా.. నేను పలాసకు వెళ్తా. అవసరమైతే న్యాయస్థానం నుంచి ఆర్డరు తెచ్చుకొని మరీ వెళ్తా. మంత్రి అప్పలరాజును అడుగుతున్నా.. మమ్మల్ని చూస్తే ఎందుకంత భయం? నేనేమీ టెర్రరిస్టును.. నక్సలైట్‌ను కాను. ఓపిక నశించింది.. ఇక ఈ ప్రభుత్వంపై యుద్ధమే. శ్రీకాకుళం పోలీసులు బండి ఎక్కకపోతే లోపలికి, విశాఖ పోలీసులు దిగకపోతే కిందకి లాగుతున్నారు. నిశ్చితార్థం అక్షింతలు కూడా పోలీసుల మధ్యలోనే వేయాల్సి వచ్చింది’ అన్నారు.

పెళ్లికి వెళ్తున్నామని చెప్పినా..

కాశీబుగ్గలో తెదేపా నాయకుడి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ సమీపంలోని బెండిగేటు దగ్గర వారి వాహనాల్ని అడ్డుకున్నారు. పెళ్లికి వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. పెళ్లికార్డు చూపడంతో వారితోపాటే పోలీసులు వివాహ వేదిక వరకూ వెళ్లి.. అక్కడ వదిలిపెట్టారు. అనంతరం లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు శ్రీకాకుళం వైపు వస్తున్న వీరి వాహనాలను నరసన్నపేట సమీపంలో అడ్డుకుని, స్టేషన్‌కు తరలించారు. కూన రవికుమార్‌ను శ్రీకాకుళంలో అరెస్టు చేసి గార పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.

మా నేతలు వెళ్తుంటే సీఎం జగన్​కు భయమెందుకు: పలాసలో బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం నేతలు వెళ్తుంటే సీఎం ఎందుకు భయపడుతున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో తెలుగుదేశం నేతలను ఎందుకు అరెస్టు చేశారు, ఆంక్షలు ఎందుకు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అర్ధరాత్రి కూల్చివేతలు, అక్రమ కేసులపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం నేతలు పరామర్శకు వెళ్లకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని నిలదీశారు. పలాసలో రాజకీయ కక్షతో తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం ఈ స్థాయిలో వణికిపోతుందని అన్నారు. పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 22, 2022, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.