తెదేపా, వైకాపా నేతల సవాళ్ల మధ్య లోకేశ్ పలాస​ పర్యటన

author img

By

Published : Aug 21, 2022, 9:56 AM IST

LOKESH TOUR

గత రెండు రోజులుగా PALASA వైకాపా, తెదేపా నేతల సవాళ్లతో పలాసలో రాజకీయం వేడెక్కింది. గురువారం తెదేపా నేత సూర్యనారాయణ ఇల్లును కూలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ సమయంలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్, సూర్యనారాయణను పరామర్శించేందుకు పలాస రానున్నారు. ఈ తరుణంలో పట్ణంలో భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

TENSION AT PALASA పలాసలో రాజకీయ వేడి రాజుకుంది. 27వ వార్డు కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించనున్నారు. మంత్రి అప్పలరాజుపై సూర్యనారాయణ విమర్శలు చేసిన అనంతరం అతనికి చెందిన ఇళ్లను అధికారులు కూల్చివేత చేపట్టారని, తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో విశాఖకు చేరుకున్న లోకేష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అనుమతులు లేవు: ఎస్పీ
పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో ఆదివారం ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు పోలీస్‌ పరంగా అనుమతులు మంజూరు చేయలేదని ఎస్పీ జి.ఆర్‌.రాధిక ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతుల్లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జంట పట్టణాల పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ వివరించారు.

తెదేపా నేతల అడ్డగింత: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద తెదేపా నేతలను పోలీసులు అడ్డగించారు. అచ్చెన్న, రామ్మోహన్‌, చౌదరి బాబ్జీని అడ్డుకున్నారు. పలాసలో శుభకార్యానికి వెళ్తున్నామని పోలీసులకు తెలపగా.. అచ్చెన్నాయుడితో పాటు కారులో పోలీసులు బయలుదేరారు.

ఇదీ జరిగింది: శ్రీకాకుళం జిల్లా పలాస శ్రీనివాసనగర్‌లోని 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు గురువారం సాయంత్రం పొక్లెయిన్‌తో అక్కడికి చేరుకున్నారు. చెరువు గర్భంలో ఆక్రమంగా నిర్మాణాలు జరిపారని వాటిని తొలగించేందుకు వచ్చామని పేర్కొనటంతో ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని.. విద్యుత్తు బిల్లు, ఇంటిపన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కూలగొడతామంటే తామంతా ఎక్కడికి వెళ్లాలంటూ అడ్డు తగిలారు.

అనంతరం అధికారులు పొక్లెయిన్‌తో 27వ వార్డు తెదేపా కౌన్సిలర్‌ జి.సూర్యనారాయణ ఇంటి వద్దకు చేరుకుని తొలగించేందుకు సిద్ధమవటంతో జనం అక్కడా బైఠాయించారు. మంత్రికి విన్నవించాక కూడా తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంతలో వైకాపా నాయకులు అక్కడకి చేరుకోవటంతో తెదేపా, వైకాపా మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్‌ అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.

పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతున్నారని ఎమ్మెల్యే అశోక్‌ విమర్శించారు. అనంతరం పోలీసులు పొక్లెయిన్‌ను వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా రాజకీయాలు ఈ జిల్లాలో ఎప్పుడూ లేవన్నారు. ప్రజల్ని బాధపెట్టి ఏం సాధిస్తారని నిలదీశారు. వైకాపా నేతలే సవాలు విసిరారని.. అధికారంలో ఉన్నది వారే కాబట్టి దమ్ముంటే విచారణ జరిపించి తప్పును నిరూపించాలన్నారు. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే అశోక్‌ను మందస పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బలవంతంగా పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు.

ఓ మహిళ పలాస తహసీల్దార్‌ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. చెరువు విస్తీర్ణం పరిశీలించాలని తహసీల్దార్‌కు విన్నవించటంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంతలో వైకాపా నాయకులు విషయాన్ని మంత్రి అప్పలరాజు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన కొంతమందిపై ఫిర్యాదు వచ్చిందని పేర్కొనటంతో, వారిపై చర్యలు తీసుకుని మిగిలిన పేదలందరి ఇళ్లు విడిచిపెట్టాలని దుర్గ అనే మహిళ ఫోన్‌లో మంత్రికి విన్నవించారు. తాను కార్యాలయంలో ఉంటానని మీరంతా వస్తే పట్టాలు ఇస్తామని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.