ETV Bharat / state

శ్రీకాకుళంలో ప్రారంభమైన.. "సామాజిక న్యాయ భేరి" బస్సు యాత్ర

author img

By

Published : May 26, 2022, 2:38 PM IST

BUS TOUR
శ్రీకాకుళంలో ప్రారంభమైన "సామాజిక న్యాయ భేరి" బస్సు యాత్ర

BUS TOUR: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం.. ప్రజలకు వివరించేందుకు.. "సామాజిక న్యాయ భేరి" పేరిట వైకాపా మంత్రులు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏడు రోడ్ల కూడలిలో వైకాపా బస్సు యాత్ర ప్రారంభమైంది. ముందుగా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం.. సన్‌రైజ్‌ హాటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

BUS TOUR: రాష్ట్రంలో సీఎం జగన్‌ సృష్టించిన సామాజిక విప్లవం దేశమంతా అవలంబించాలని.. మంత్రులు ఆకాంక్షించారు. మంత్రివర్గంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు 'సామాజిక న్యాయభేరి' పేరిట శ్రీకాకుళం నుంచి 4 రోజుల బస్సు యాత్ర ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న 17 మంది మంత్రులు తమ తమ సామాజిక వర్గాలకు వైకాపా ప్రభుత్వంలో దక్కిన ప్రాధాన్యాలను వివరిస్తామని చెప్పారు. 82 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కార్పొరేషన్లకు నిధులు ఎంత ఇచ్చారనేది ముఖ్యం కాదని, రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ముఖ్యమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

శ్రీకాకుళంలో ప్రారంభమైన "సామాజిక న్యాయ భేరి" బస్సు యాత్ర

రాష్ట్రంలోని ప్రజలను చైతన్యపరిచేందుకే బస్సు యాత్ర చేపట్టామని పశుసంవర్థక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జగన్‌ స్ఫూర్తిని దేశంలో అందరూ పాటిస్తారని.. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడతామని తెలిపారు. జగన్‌ ఉద్దేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన బస్సు యాత్ర ఎచ్చెర్ల, రణస్థలం చేరుకున్న అనంతరం అక్కడ నుంచి విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ, నాతవలస, డెంకాడ వరకు బస్సు పర్యటన సాగుతోంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు విజయనగరంలో బహిరంగ సభ ఉంటుంది. తర్వాత విశాఖపట్నం బయలుదేరి వెళ్లి రాత్రి అక్కడ బస చేస్తారు.

27న విశాఖలో బయలుదేరి గాజువాక, లంకెలపాలెం కూడలి, అనకాపల్లి జంక్షన్‌, తాళ్లపాలెం జంక్షన్‌, యలమంచిలి వై జంక్షన్‌, నక్కపల్లి, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించి రాత్రికి తాడేపల్లిగూడెం వెళ్లి అక్కడే బస చేస్తారు. 28న నారాయణపురం, ఏలూరు బైపాస్‌, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం, విజయవాడ తూర్పు, మంగళగిరి, గుంటూరు ఆటోనగర్‌, చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట చేరుకుని బహిరంగ సభ నిర్వహిస్తారు. నంద్యాలలో రాత్రి బస చేస్తారు. 29న పాణ్యం, కర్నూలు, డోన్‌, వెల్దుర్తి, గుత్తి, పామిడి, గార్లదిన్నె మీదుగా అనంతపురం వెళ్లి అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

బస్సు యాత్రలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, కె.నారాయణస్వామి, తానేటి వనిత, అంజాద్‌ బాషా, రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, పినిపె విశ్వరూప్‌, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్‌, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌, విడదల రజని, ఉషశ్రీ చరణ్‌ పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.