ETV Bharat / state

ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. కూలీల కష్టాన్ని దోచుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్

author img

By

Published : Mar 26, 2023, 9:32 PM IST

Etv Bharat
Etv Bharat

SCAM IN NREGA: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు ఆదాయవనరుగా మారింది. గ్రామం వదిలి వెళ్లిన వారు, దూర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారి పేర్లు, కూలీ పని ఎరుగని వారి పేర్లు, మంచాన పడ్డ వారి పేర్లనూ మస్టర్లలో చేర్చి హాజరు వేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదంటూ కష్టపడి పనిచేస్తున్న వారు ఆవేదనకు గురవుతున్నారు. ఈ అవినీతి బాగోతాన్ని స్వయంగా వేతనదారులే బయటపెట్టారు.

ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. కూలీల కష్టాన్ని దోచుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్

SCAM IN NREGA : వలసలు నిరోధించి గ్రామాల్లోనే పేద వర్గాలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొంతమంది అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. రోజంతా ఎండలో చెమటోడ్చి పనిచేసే నిరుపేదల కష్టాన్ని తప్పుడు మస్టర్లతో స్వాహా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు పంచాయతీ కాశీపురంలో గత మూడేళ్లుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. పనికి వెళ్లకున్నా, గ్రామం విడిచి వెళ్లి దూర ప్రాంతాల్లో స్థిరపడ్డవారి పేర్లూ మస్టర్లలో నమోదవుతున్నాయని వేతన దారులు ఆరోపిస్తున్నారు. వారందరి పేర్లూ నమోదు కావడం వల్ల తమ వేతనానికి ఎసరు తగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డబ్బు కట్టి..పని పట్టి : పనికి రాని వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మిగతా మొత్తాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. అటు ఉపాధి పని కల్పించాలంటే తమ వద్ద నుంచి వారానికి 200 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడని అలా ఇచ్చిన వారికే మస్టర్లు నమోదువుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం క్షేత్ర సహాయకుడిగా పనిచేస్తున్నవ్యక్తి గతంలోనూ రెండు సార్లు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడని మళ్లీ అతడికే అధికారులు అవకాశం కల్పించడంతో పేట్రేగిపోతున్నాడని ఆవేదన వెలిబుచ్చారు. ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నాడని వాపోతున్నారు.

50 రూపాయలు.. అవ్వా తాతలకు ఉపాధి హామీ : లమ్మత కృష్ణారావు మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తూ పడిపోగా తీవ్రంగా గాయపడి మంచం నుంచి లేవలేని పరిస్థితికి చేరుకున్నారు. ఈయన పేరును కూడా మస్టర్‌లో చేర్చి మూడేళ్లుగా ఉపాధి పనికి వెళ్తున్నట్లు చూపుతున్నారు. ఆయన పేరు మీద వస్తున్న మొత్తంలో కొంత అతడికి ఇచ్చి మిగిలిన డబ్బును స్వాహా చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా మంచం పట్టిన అట్టాడ అప్పమ్మది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఈమె కూడా పనికి వస్తున్నట్లు చూపుతున్నారు. డబ్బు చెల్లింపుల సమయంలో ఆమె వద్దకు వచ్చి వేలి ముద్రలు తీసుకుని 50 రూపాయలు మాత్రం ఆమెకు ఇచ్చి మిగతాది జేబుల్లో వేసుకుంటున్నారు.

మనిషి దుబాయ్​లో.. పని కాశీపురంలో : నాగరత్నం అనే మహిళ, ఆమె భర్తకు 12 ఎకరాల స్థలం ఉన్నా ఏనాడూ సొంత పొలంలోనే పనికి వెళ్లలేదు. వీరి పిల్లలూ బాగా స్థిరపడ్డ వారే. అలాంటి ఈ దంపతుల పేర్లపైనా మస్టర్లు నమోదవుతున్నాయి. మురపాల అప్పారావు రెండేళ్లుగా దుబాయ్‌లో ఉన్నా ఆ సమయంలోనూ ఆయన పేరు ఉపాధి హామీ పనుల్లో నమోదవుతూ వచ్చింది. ఇలాంటి అక్రమాలు కాశీపురంలో కోకొల్లలు అంటున్నారు స్థానికులు. ఫీల్డ్‌ అసిస్టెంట్ అక్రమాల వల్ల నిజంగా ఉపాధి హామీ పనులు చేసిన వారి వేతనాల్లో కోతలు విధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు..

గ్రామస్థుల డిమాండ్..ఎంపీడీఓ గ్రామసభ : గ్రామంలో మూడేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై జిల్లా స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కాశీపురం ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. పనికి వెళ్లే వారికే కష్టానికి తగ్గ పేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అయితే క్షేత్ర సహాయకుడి అక్రమాలపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, తక్షణమే గ్రామంలో గ్రామ సభ నిర్వహించి విచారణ జరిపిస్తామని సంతబొమ్మాళి ఎంపీడీఓ ఉమాసుందరి తెలిపారు.

" ప్రతి ఒక్క మనిషికి 200 రూపాయలు ఇస్తే మీకు ఫుల్ మస్టర్లు వేస్తానని చెప్పి, అక్కడ ఒక పెద్ద మనిషి చెపితే ఆ పెద్ద మనిషి ప్రకారం ఫాలో అయ్యి ఒక్కొక్కరి దగ్గర 200 రూపాయలు తీసుకుంటున్నాడు.మేము గత సంవత్సరం పనికి వెళ్తే రెండు వారాల డబ్బులు రాలేదు. " - లమ్మత సద్గుణమూర్తి, కాశీపురం గ్రామస్థుడు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.