ETV Bharat / state

రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతోంది: ఎంపీ జీవీఎల్​

author img

By

Published : Feb 21, 2023, 9:05 PM IST

BJP MP GVL ON MLC ELECTIONS IN AP
BJP MP GVL ON MLC ELECTIONS IN AP

BJP MP GVL ON MLC ELECTIONS IN AP : ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్​ విమర్శించారు. ప్రతిపక్షాలను కట్టడి చేసే ప్రయత్నంలో.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుస్తామనడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనం అని వెల్లడించారు.

BJP MP GVL ON MLC ELECTIONS IN AP : రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు. ప్రస్తుతం పోలీసు రాజ్యం నడుస్తుందని.. ప్రజాక్షేత్రంలో ఎన్నికైనప్పటికీ పాలకులకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని విమర్శించారు. ఇటువంటి పాలన కొత్త తరహా రాజకీయానికి తెర లేపుతుందని పేర్కొన్నారు.

కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇటువంటి పాలనను ఎన్నడూ చూడలేదని తెలిపారు. ప్రతిపక్షాలను కట్టడి చేసే ప్రయత్నంలో.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుస్తామనడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనం అని వెల్లడించారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. నిజమైన అధికారం ఒక కుటుంబం.. ఒకే సామాజిక వర్గంలో కేంద్రీకృతం చేసిందని అన్నారు. బీసీలతో పాటు మైనారిటీలకు నామమాత్రపు పదవులు కట్టుబడు రాజకీయాల్లో భాగమని ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీలతో సామాజిక సాధికారత సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పోటీ చేస్తున్నారని జీవీఎల్​ చెప్పారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనే ధీమా తమకుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా కుటుంబాలకు, అవినీతికి పట్టం కట్టేవి అయితే.. కేవలం ప్రజాసేవలో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక గెలుస్తామనే ధీమా తమకు ఉందని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణు గోపాలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్.ఈశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.