'నా చేను లాక్కొని.. నాపై మంత్రి మర్డర్ కేసు పెడతారంటా'

author img

By

Published : May 13, 2022, 4:10 PM IST

'నా చేను లాక్కొని.. నాపై మంత్రి మర్డర్ కేసు పెడతారంటా'

'నా చేను లాక్కొని.. నాపైనే మర్డర్ కేసు పెడతానని మంత్రి సురేశ్ బెదిరిస్తున్నారు' అని ప్రకాశం జిల్లా దరిమడుగు గ్రామానికి చెందిన రంగలక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మర్కాపురంలో ఇవాళ నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ఆమె మరోసారి మంత్రిపై ఫిర్యాదు చేశారు.

'నా చేను లాక్కొని.. నాపై మంత్రి మర్డర్ కేసు పెడతారంటా'

'పుట్టింటివారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలాన్ని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆక్రమించారు. న్యాయం చేయాలని కోరుతూ గత పదిహేనేళ్లుగా కార్యాలయాలచుట్టూ తిరుగుతున్నా. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లే ఇలా చేస్తే ఇక మాకు ఎవరు న్యాయం చేస్తారు. నా పొలం లాక్కొని మంత్రి నాపైనే మర్డర్ కేసు పెడతానంటున్నారు. ఆయన మంత్రి అయితే ఎవరికి గొప్ప. నా కడుపు మండిపోతుంది' అని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు.

మంత్రి సురేశ్ తన భూమిని కబ్జా చేశారని ఈనెల 9న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన రంగలక్ష్మమ్మ మార్కాపురంలో ఇవాళ నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆవేదనను అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. 'ఇదివరకే ఫిర్యాదు చేశారు కదా.. మళ్ళీ ఇక్కడకు ఎందుకొచ్చారు' అని ఆమెను అధికారులు ప్రశ్నించారు. అధికారులతో మాట్లాడుతుండగానే అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు.

ఇదీ వివాదం నేపథ్యం...: అర్జీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్కాపురం మండలం ఇడుపూరులో సర్వే నంబరు 841/1లోని ఎకరా పొలాన్ని పసుపు కుంకుమ కింద కేసరి రంగలక్ష్మమ్మ అనే మహిళ పేరుతో పుట్టింటివారు 2008లో నంబరు 1615 ద్వారా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ ఎకరా భూమిని మంత్రి సురేశ్ తన విద్యాసంస్థల ఏర్పాటు కోసం కబ్జా చేసినట్టు ఆమె ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై రంగలక్ష్మమ్మ సోదరుడు బట్టగిరి వెంకట రామాంజులరెడ్డి మాట్లాడుతూ.. '841/1 సర్వే నంబరులో 13.70 ఎకరాలకు మొత్తం ఆరుగురు హక్కుదారులు. వీరిలో కేవలం నలుగురి నుంచే తప్పుడు పత్రాలతో మంత్రి సురేశ్ భూమిని కొనుగోలు చేశారు. అక్కడ మా సోదరికి పసుపు కుంకుమ కింద రాసిచ్చిన ఎకరాతో పాటు, తన పేరుతోనూ ఉన్న మరో రెండు ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆదిమూలపు సురేష్‌ ఎమ్మెల్యే అయిన తర్వాత మా పాసు పుస్తకాలు రద్దు చేయించి వాటిని రికార్డుల్లో నుంచి తొలగించారు' అని ఆరోపించారు.

ఇదీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.