'మంత్రి నా పొలాన్ని ఆక్రమించారు'.. కలెక్టర్​కు మహిళ ఫిర్యాదు

author img

By

Published : May 9, 2022, 3:52 PM IST

Updated : May 10, 2022, 5:15 AM IST

'మంత్రి నా పొలాన్ని ఆక్రమించారు'

మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. మీరైనా న్యాయం చేయండంటూ 'స్పందన' కార్యక్రమంలో కలెక్టర్‌ను వేడుకుంది.

'మంత్రి నా పొలాన్ని ఆక్రమించారు'

‘పుట్టింటివారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఎకరా పొలాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆక్రమించారు. న్యాయం చేయాలని కోరుతూ గత పదిహేనేళ్లుగా కార్యాలయాలచుట్టూ తిరుగుతున్నా. జిల్లాకు వచ్చిన ప్రతి కలెక్టరుకూ అర్జీ ఇస్తున్నా. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లే ఇలా చేస్తే ఇక మాకు ఎవరు న్యాయం చేస్తారు?’ అని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని దర్శిలో సోమవారం నిర్వహించారు. కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో పులి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ హాజరయ్యారు. మంత్రి సురేష్‌ తమ పొలాన్ని ఆక్రమించారని.. ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రంగలక్ష్మమ్మ అర్జీ అందజేశారు. ‘మీరైనా న్యాయం చేయండి సారూ..’ అంటూ కలెక్టర్‌ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘మీరంతా మంత్రికే కాపలా... ఆయనకే వత్తాసు పలుకుతారు. ఇక మాకు న్యాయం చేసేవారు ఎవరూ లేరు...’ అంటూ రంగలక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ వివాదం నేపథ్యం...: అర్జీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. మార్కాపురం మండలం ఇడుపూరులో సర్వే నంబరు 841/1లోని ఎకరా పొలాన్ని పసుపు కుంకుమ కింద కేసరి రంగలక్ష్మమ్మ అనే మహిళ పేరుతో పుట్టింటివారు 2008లో నంబరు 1615 ద్వారా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ ఎకరా భూమిని మంత్రి సురేష్‌ తన విద్యాసంస్థల ఏర్పాటు కోసం కబ్జా చేసినట్టు ఆమె ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై రంగలక్ష్మమ్మ సోదరుడు బట్టగిరి వెంకట రామాంజులరెడ్డి మాట్లాడుతూ.. ‘841/1 సర్వే నంబరులో 13.70 ఎకరాలకు మొత్తం ఆరుగురు హక్కుదారులు. వీరిలో కేవలం నలుగురి నుంచే తప్పుడు పత్రాలతో మంత్రి సురేష్‌ భూమిని కొనుగోలు చేశారు. అక్కడ మా సోదరికి పసుపు కుంకుమ కింద రాసిచ్చిన ఎకరాతో పాటు, తన పేరుతోనూ ఉన్న మరో రెండు ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆదిమూలపు సురేష్‌ ఎమ్మెల్యే అయిన తర్వాత మా పాసు పుస్తకాలు రద్దు చేయించి వాటిని రికార్డుల్లో నుంచి తొలగించారు’ అని ఆరోపించారు.

మహిళవి తప్పుడు ఆరోపణలు

రంగలక్ష్మమ్మ ఆరోపణల్లో నిజం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ కార్యాలయ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి. తన భూమిని మంత్రి సోదరుడు ఆక్రమించినట్టు గతంలో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారని.. ఇప్పుడు ఏకంగా మంత్రిపైనే ఆరోపణలు చేస్తుండటాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయమై మార్కాపురం జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో రంగలక్ష్మమ్మ వేసిన దావాను 2018 మార్చి 27న కోర్టు డిస్మిస్‌ చేసిందని గుర్తుచేశారు.

ఇవీ చదవండి:

Last Updated :May 10, 2022, 5:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.