ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. తెరపైకి కోటంరెడ్డి స్నేహితుడు.. ఏం చెప్పారంటే..!

author img

By

Published : Feb 8, 2023, 7:22 PM IST

రామశివారెడ్డి
రామశివారెడ్డి ()

Ramashivareddy pressmeet : ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన స్నేహితుడు రామశివారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇంతలా ఆరోపణలు వస్తాయని తాను ఊహించలేదని.. "కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాస్తున్నాను.." అని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పడం ఆందోళన కలిగించిందని రామశివారెడ్డి పేర్కొన్నారు.

Ramashivareddy pressmeet : ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శిస్తున్నాడు. అధిష్టానం ఆదేశాలతోనే తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ వ్యవహారంలో వైసీపీ నుంచి బయటకు వచ్చారు. కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ట్యాపింగ్ జరిగిందనేది ఆయన ఆరోపణ. కాగా, ఈ ఆరోపణపై కొద్ది రోజుల్లో రామశివారెడ్డి స్వయంగా వెల్లడిస్తారని వైఎస్సార్సీపీ రీజినల్ ఇన్​చార్జి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఫోన్ సంభాషణలో కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి మీడియా ముందుకు వచ్చారు.

ఫోన్ రికార్టింగ్ అయ్యింది.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆ ఆడియోను ఇంటెలిజెన్స్ డీజీ రామాంజనేయులు తనకు పంపించారని కోటంరెడ్డి చేసిన ఆరోపణను వైసీపీ అధిష్ఠానం కొట్టేసింది. అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అని ఖండిస్తూ వచ్చింది. ఈ వ్యహారంలో కీలకంగా ఉన్న రామశివారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యే కోటంరెడ్డితో తనకు అనుబంధం ఉందని తెలిపారు.

తన ఫోన్​లో ఆటోమేటిక్​గా రికార్డ్ అవుతుంది.. ఆ రోజు కూడా రికార్డ్ అయ్యింది. నా ఫోన్​లో ఉన్న కాంట్రాక్టర్ విషయంపై రికార్డింగ్​ని స్నేహితుల వద్ద యాదృచ్ఛికంగా వినిపించాను. రాష్ట్ర ప్రభుత్వంపై ఇంత ఆరోపణలు వస్తాయని నేను ఊహించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పడం నాకు ఆందోళన కలిగించింది. చిన్న విషయంపై రాష్ట్రంలో ఇంత ఆందోళన జరగడం నన్ను కలిచివేసింది.

రామశివారెడ్డి

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాకు ఫోన్ చేశారు. యోగ క్షేమాల్లో భాగంగా మాట్లాడుకుంటూ కలెక్టర్ ఆఫీసులో జరిగిన విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. నా ఫోన్​లో ఆటోమేటిక్ రికార్డింగ్ అవుతుంది. కానీ, ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కేంద్ర హోం శాఖ మంత్రికి లెటర్ రాస్తున్నట్లు చెప్పడం నాకు అందోళన కలిగించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలు ఎదుర్కోవడం నేను ఓర్చుకోలేక మీడియా ముందుకు వచ్చాను. - రామశివారెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి స్నేహితుడు

MLA Kotamreddy Sridhar Latest comments: ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం శాఖకు తాను లేఖ రాశానని వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అపాయిమెంట్ దొరికితే నేరుగా వెళ్లి కేంద్ర హోం శాఖను కలిసి లేఖను ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు పేరొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి తాను నిరంతరం ప్రజల్లోకి వస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను ఆరోపిస్తే.. తనపైనే విమర్శలు చేస్తున్నారని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన ఆరోపణలపై ఎదుటివారు సరైన పద్ధతిలో మాట్లాడాలి గానీ.. తనపై శాపనార్థాలు, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆగ్రహించారు.

తన నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు పనుల గురించి మాట్లాడితే తప్పా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు నిధులు ఆపేస్తే అభివృద్ది నిలిచిపోతుందని.. ప్రజలు ఇబ్బందిపడతారని అన్నారు. రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. ధ్వంసమైన రహదారులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కోటంరెడ్డి కోరారు. పొట్టెపాలెం బ్రిడ్జి రోడ్డు నిర్మాణం విషయంలో 2021 నుంచి తాను ముఖ్యమంత్రిని అడుగగా.. రూ.28 కోట్లు విడుదల చేస్తున్నామని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని కోటంరెడ్డి వెల్లడించారు.

ఇదీ సంగతి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.