ETV Bharat / state

మహిళా పోలీసులకు అవమానం.. లేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్!

author img

By

Published : Feb 7, 2022, 3:49 PM IST

Updated : Feb 8, 2022, 8:59 AM IST

మహిళలకు ఎక్కడైనా పురుష టైలర్ చేత డ్రెస్సులు కుట్టించేందుకు కొలతలు తీయిస్తారా..? ఒక్కసారి ఆలోచించండి అది ఎంత దారుణమైన చర్య. కానీ.. పోలీసులే ఆ అమానవీయ ఘటనకు సాక్ష్యంగా నిలిచారు. మహిళా పోలుసులే బాధితులుగా మారారు. నెల్లూరులో మహిళా కానిస్టేబుళ్ల యూనిఫాం కుట్టేందుకు పురుష టైలర్లు కొలతలు తీసుకోవడం తీవ్రస్థాయిలో దుమారం రేపింది. కొలతలు తీసుకోవడంలో మహిళా టైలర్లకు అనుభవం లేనందునే మగవాళ్లను వినియోగించామని కొద్దిసేపటికే వారిని పంపిచేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రకటనపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయగా.. పోలీసులు మాత్రం కొలతలు తీసుకునేటప్పుడు ఫొటోలు తీసిన వారెవరో తేల్చేందుకు విచారణ చేపట్టారు

లేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్!
policeలేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్!

Nellore News: మహిళా పోలీసులకు అవమానం జరిగింది. వారికి యూనిఫాం కుట్టించేందుకు పురుష టైలర్లను పెట్టి కొలతలు తీయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నెల్లూరులో సోమవారం జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోశాయి. నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానంలో ఉన్న ఉమేశ్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం సచివాలయ మహిళా పోలీసులకు యూనిఫాం కొలతలు తీసుకునే కార్యక్రమం చేపట్టారు. ఆత్మకూరు, కావలి డివిజన్ల నుంచి హాజరైన మహిళా పోలీసులకు కొలతలు తీసేందుకు పురుష టైలర్లను పెట్టడం వివాదాస్పదమైంది.

అక్కడే కొందరు మహిళా పోలీసులున్నా.. పురుషుడు కొలతలు తీసుకోవడంతో వారంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో అక్కడ ఓ హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ముగ్గురు పురుష కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. తమలో చాలా మందికి టైలరింగ్‌ వచ్చని.. మమ్మల్నే కొలతలు తీయమని చెప్పినా బాగుండేదని, పురుషులతో తీయించడమేమిటని పలువురు మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థంగాక మీడియా సంస్థలను ఆశ్రయించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకువచ్చి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

లేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్

పోలీసు అధికారులది పూటకో మాట

విషయం తెలుసుకున్న ఎస్పీ సీహెచ్‌ విజయారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘మహిళా పోలీసుల యూనిఫాం బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పజెప్పాం. మహిళా పోలీసుల దుస్తులు కొలతలు తీసేందుకు మహిళలనే నియమించాం. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దాం. అనుమతి లేని ప్రదేశంలోకి ప్రవేశించి, ఫొటోలు తీసిన గుర్తుతెలియని వ్యక్తిపైనా చట్టపరమైన చర్యలకు ఆదేశించాం’ అని ఎస్పీ చెప్పారు. సాయంత్రం అదనపు ఎస్పీ వెంకటరత్నం మాట్లాడుతూ.. మహిళా టైలర్లు చాలా తక్కువగా ఉన్నారని, అందులోనూ పోలీసుల యూనిఫాం కుట్టేవారు అసలు లేకపోవడంతో ఉన్నవారికి కొలతలు తీయడం ఎలానో చూపించేందుకు పురుష టైలర్‌ వచ్చారని చెప్పారు.

లేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్

‘ఆ సమయంలో ముగ్గురు మహిళా ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. వీరందరినీ నేనే పర్యవేక్షిస్తున్నాను. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఒక్క క్షణంలో వచ్చి ఫొటోలు తీసుకువెళ్లారు. దీన్ని మహిళా పోలీసులందరూ ఖండిస్తున్నారు. అనుమతి లేకుండా ఫొటోలు తీసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మీరాపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పారు. పురుష టైలర్‌ కొలతలు తీసుకుంటున్నట్లు తెలియగానే.. అతణ్ని పంపించేశామని, అంతా మహిళలతోనే కొలతలు తీయించినట్లు ఎస్పీ చెబుతుండగా.. అప్పటికే అక్కడ ముగ్గురు పురుష కానిస్టేబుళ్లు ఉన్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. కొలతలు ఎలా తీసుకోవాలో మహిళా టైలర్లకు చూపించేందుకే పురుష టైలర్‌ వచ్చారని సాయంత్రం ఏఎస్పీ చెప్పారు. కేవలం ఒక్క సెకనులో గుర్తుతెలియని వ్యక్తి ఫొటో తీసుకెళ్లారన్నారు. అయితే కొన్ని నిమిషాలపాటు కొలతలు తీస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.

"పోలీసు యూనిఫాం కుట్టే లేడీస్ టైలర్స్ తక్కువగా ఉన్నారు. యూనిఫాం కుట్టే బాధ్యతను బయటి వారికి అప్పజెప్పాం. మహిళా పోలీసులకు కొలతలు ఎలా తీసుకోవాలో తెలియదు. కొలతలు రాసుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు...కొలతలు ఎలా తీసుకోవాలో ఒకరిద్దరికి కొలతలు తీసుకొని చూపించారు. అంతేకానీ వారు అందరికీ కొలతలు తీసుకోలేదు. మహిళా పోలీసులే కొలతలు తీసుకున్నారు. వారు కేవలం కొలతలు రాసుకోవటానికి మాత్రమే వచ్చారు. ఎవరో కావాలనే దీనిపై రాద్దాంతం చేస్తున్నారు." -వెంకటరత్నం, ఏఎస్పీ

.

యువజన విద్యార్థి నాయకుల నిరసన

మహిళా పోలీసులకు యూనిఫాం కొలతలు పురుష టైలర్‌తో తీయించి వారిని అవమానపరిచారంటూ ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎండీ సిరాజ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ మస్తాన్‌లతో పాటు పలువురు విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

లేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్!
లేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్!

మహిళా కమిషన్‌ ఆరా

నెల్లూరులో పురుషులతో మహిళా పోలీసులకు యూనిఫామ్‌ కొలతలు తీయించిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఎస్పీకి ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హోం మంత్రి రాజీనామా చేయాలి

మహిళా పోలీసులకు పురుషులతో కొలతలు తీసుకోవడానికి ప్రభుత్వానికి, అధికారులకు సిగ్గనిపించలేదా? మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా ఇలాగే చేస్తే ఊరుకుంటారా? హోం మంత్రి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. - సాధినేని యామినీ శర్మ, భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి

బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి

మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మార్చుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టులో విచారణ జరుగుతుండగానే వారికి ఖాకీ ప్యాంటు, చొక్కా కుట్టించడం అప్రజాస్వామికం. పైగా కొలతలను పురుష టైలర్లతో తీయించడం తీవ్ర అభ్యంతరకరం. హోం మంత్రి సుచరిత వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. - రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి

ఎస్పీ తీరు గతంలోనూ వివాదస్పదం...

నెల్లూరు ఎస్పీ విజయారావు వ్యవహారశైలి గతంలో అమరావతి ప్రాంతంలో మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టించిన సందర్భంలోనూ వివాదాస్పదమైంది. రెండేళ్ల కిందట రాజధాని ప్రాంతమైన మందడం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గదుల్ని పోలీసుల బసకు కేటాయించటంతో విద్యార్థులకు విధిలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఆరుబయట పాఠాలు చెప్పారు. ఈ దృశ్యాల్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై 2020 జనవరి 23న గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఓ తప్పుడు కేసు నమోదు చేశారు. తాను దుస్తులు మార్చుకుంటుండగా.. మీడియా ప్రతినిధులు వీడియో తీశారంటూ శిక్షణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించి ఐపీసీ 448, 354(సీ), 509 రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధక చట్టం తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాజధాని గ్రామాల ప్రజల పోరాటాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నందున ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పుడు ఫిర్యాదుతో తమపై కేసు నమోదు చేశారని అప్పట్లో మీడియా ప్రతినిధులు కోర్టుకు విన్నవించుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు ఎస్పీగా ఉన్న సీహెచ్‌ విజయరావు అప్పట్లో గుంటూరు రూరల్‌ ఎస్పీగా బాధ్యతల్లో ఉన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు మీడియా ప్రతినిధులపై ఎస్సీ, ఎస్టీ దాడుల నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లను తొలగించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు ఎస్సీ అనే విషయం మీడియా వారికి ఎలా తెలుస్తుందని పోలీసుల్ని ప్రశ్నించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు విజయారావును రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ రైల్వే ఎస్పీగా బదిలీ చేసింది. గతేడాది జులైలో నెల్లూరు ఎస్పీగా పంపింది.

ఇదీ చదవండి : మరో ఐదు రోజుల్లో ఆ యువకుడి పెళ్లి... కానీ అంతలోనే..

Last Updated :Feb 8, 2022, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.